ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆశతో ఉన్న భారతీయ జనతా పార్టీ కి తిప్పుకోలేని దెబ్బ తగిగిలింది. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు కులంలో తిరుగులేని నేత కన్నా లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీ నుంచి వైదొలగారు. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పని తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ గత కొద్ది కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
సోము వీర్రాజు ఏకపక్షంగా జిల్లా అధ్యక్షులను మార్చేయడం పుండుమీద కారం చల్లినట్లుగా మారింది. తాను ఎంతో మందిని ఒప్పించి పార్టీలోకి తీసుకువచ్చి వారికి బాధ్యతలు అప్పగించానని, అలాంటి వారిని అర్ధంతరంగా పదవుల నుంచి తొలగిస్తే వారేం చేయాలని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. జిల్లా పార్టీ అధ్యక్షులను ఏకపక్షంగా తొలగించడమే కాకుండా పార్టీ వ్యవహారాలను కూడా సోము వీర్రాజు తన విధేయులకు తప్ప వేరెవ్వరికి చెప్పడం లేదని ఆరోపణ ఉంది.
ఈ నేపథ్యంలో కేంద్ర కమిటీ నుంచి పలు సూచనలు వచ్చినా సోము వీర్రాజు ఖాతరు చేయడం లేదు. దాంతో విసిగి పోయిన కన్నా లక్ష్మీనారాయణ పార్టీ నుంచి వైదొలగారు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. కొద్ది కాలం కిందట జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ నాయకుడు నాదెండ్ల మనోహర్ తో ఆయన చర్చలు జరిపారు. తెలుగుదేశం నాయకులతో కూడా ఆయన టచ్ లో ఉన్నారు. ఈ రెండు పార్టీలలో ఏ పార్టీలో చేరతారనేది ఇంకా వెల్లడి కాలేదు.