విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పని చేస్తూ, కరోనా నియంత్రణకు భద్రతా విధులు నిర్వహించి, మృతిచెందిన పోలీసు కుటుంబాలతో జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ జిల్లా పోలీసు కార్యాలయంలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ మాట్లాడుతూ – కరోనా నియంత్రణకు భద్రతాపరమైన విధులను నిర్వహిస్తూ, ప్రజల రక్షణకు అహర్నిశలు పని చేసి, కరోనా ప్రభావంతో మృతి చెందిన పోలీసు ఉద్యోగులు సేవలు ఎనలేనివన్నారు.
నేడు వారు భౌతికంగా మన మధ్య లేనప్పటికీ, పోలీసు శాఖకు వారందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. కుటుంబ పెద్దలను కోల్పోయామన్న ధైర్యాన్ని కోల్పోవద్దని, కరోనా బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ తాము అండగా ఉంటామన్న మనోధైర్యాన్ని, ఏ అవసరం వచ్చినా తమను నేరుగా కలవవచ్చునన్న భరోసాను జిల్లా ఎస్పీ కల్పించారు.
కోవితో మృతి చెందిన (1) సిహెచ్. రామకృష్ణ, హెచ్ సి, డిసిఆర్ బి, విజయనగరం (2) ఎస్. రమణ, ఎఎస్ఐ, సిసిఎస్, విజయనగరం (3) వి.డి.వి.వి.ఎస్.ప్రసాద్, ఎఆర్ హెచ్ సి (4) బి. చంద్రశేఖర్, పిసి, విజయనగరం ట్రాఫిక్ పిఎస్ (5) కె.విశ్వయ్య, ఎఆర్ హెచ్ సి (6) డి.వి.కృష్ణారావు, ఎఎస్ఐ, తెర్లాం పిఎస్ (7) జుట్టు పాపారావు, డీఎస్పీ, సిసిఎస్, విజయనగరం (8) కె.శ్రీనివాసరావు, ఎఆర్ కాని స్టేబులు (9) ఎం. పరంజ్యోతి, ఎస్ఐ, కొటియా కుటుంబ సభ్యుల ఒక్కొక్కరితో జిల్లా ఎస్పీ మాట్లాడి, వారికి ఇంకనూ రావాల్సిన బెనిఫిట్స్ గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం నుండి ఇప్పటికే దాదాపు అన్ని కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్స్, భద్రత ఎక్స్ గ్రేషియా, జిఐఎస్, లీవ్ ఎన్ క్యాష్ మెంట్, పోలీసు సేలరీ పేకేజ్, ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా, ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన మంజూరు అయ్యాయని, ఇంకనూ ఎపిజిఎల్ఐ మరియు కారుణ్య నియామకాలు పెండింగులో ఉన్నాయన్నారు.
ప్రభుత్వం నుండి రావాల్సిన ఇతర బెనిఫిట్స్, ఎపిజిఎల్ ఐ ని త్వరితగతిన మంజూరు చేసేందుకు, కారుణ్య నియామకాలు త్వరితగతిన చేపట్టేందుకు జిల్లా కలెక్టరు గారితో మాట్లాడి, చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ కోవిడ్ బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, ఎఆర్ డీఎస్పీ ఎల్.శేషాద్రి, ఎస్బీ సిఐ జి.రాంబాబు, డీసీఆర్ బి సిఐ బి.వెంకటరావు, వెల్ఫేర్ ఆర్ ఐ టివిఆర్ కే కుమార్, అడ్మిన్ ఆర్ ఐ చిరంజీవి, డీపీఓ పర్యవేక్షకులు శ్రీనివాస రావు, ప్రభాకరరావు, పోలీసు అసోసియేషను అడహక్ సభ్యులు కె.శ్రీనివాసరావు, కోవిడ్ అమర వీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.