అమరావతే రాజధానిగా ఉండాలని చెబితే నా దిష్టిబొమ్మ దగ్ధం చేసేంత కోపం ఉన్న కర్నూలు నాయకులకి సుగాలీ ప్రీతిని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేస్తే ఎందుకు కోపం రాలేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కర్నూలు, ఎమ్మిగనూరు క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో నేడు ఆయన మాట్లాడారు.
కర్నూలుకు హైకోర్టు అడిగే ముందు సుగాలీ ప్రీతికి న్యాయం చేయాలని ఆయన అన్నారు. కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్ చేస్తే అభివృద్ధి చేసినట్లు కాదని యువతకు ఉపాధి అవకాశాలు పెంచే ప్రణాళికలు కావాలని స్పష్టం చేశారు. పరిశ్రమలు, ఐటిహబ్ లాంటివి నెలకొల్పితేనే అభివృద్ధి జరుగుతుందన్నారు.
రాయలసీమ ప్రాంతం కొన్ని కుటుంబాలు, గ్రూపుల చేతిలో చిక్కుకుపోయింది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పాలకులు మారతారు తప్ప ప్రజల తలరాతలు మారవు. ఇప్పటి వరకు సీమ నుంచి ఆరుగురు ముఖ్యమంత్రులు వచ్చినా పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించలేకపోయారు.
నాయకులు వేల కోట్లు సంపాదిస్తున్నారు గానీ ప్రజల జీవితాల్లో మార్పు మాత్రం రావడం లేదు. వాళ్ల మోచేతి నీళ్లు తాగే మనం బతకాలని వారు కోరుకుంటున్నారు అని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏ వార్డుకు వెళ్లినా అయిదుగురు జనసైనికులు ఉంటే 500 మంది నా అభిమానులు ఉన్నారు.
అభిమానులను జనసైనికులుగా మార్చలేకపోయాం. దీనికి కారణం స్థానికంగా బలమైన నాయకత్వం లేకపోవడం. స్థానికంగా బలంగా ఉండే నాయకులు నా దగ్గరకు రారు. అందుకు కారణం తొలి సమావేశంలోనే ప్రజలకు ఏం చేద్దాం అని అడుగుతాను. అందుకే నన్ను చూడగానే వాళ్లు చిరాకుపడతారు అని పవన్ అన్నారు. ఈ సమావేశంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అర్హం ఖాన్, ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జి రేఖాగౌడ్ పాల్గొన్నారు.