ఇతర రాష్ర్టాల నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న శావల్యాపురం మండలం కారుమంచి గ్రామానికి చెందిన యర్రమాసు రామకోటేశ్వరరావు అలియాస్ రాము (42) పై పీడీ యాక్టు నమోదు చేశారు.
ఈ మేరకు నిందితుడిని శుక్రవారం నడికుడి నుంచి పొందుగల వెళ్లే రోడ్డులో ఆర్అండ్బీ బంగ్లా వద్ద అదుపులోకి తీసుకున్నట్టు అర్బన్ ఎస్పీ తెలిపారు. నిందితుడిని రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకు తరలిస్తున్నట్టు వెల్లడించారు.
రాముపై గత ఏడాది మే 5న అక్రమ మద్యం కేసు నమోదైంది. తెలంగాణ నుంచి లారీ, కారు, మినీ లారీ, మూడు ద్విచక్ర వాహనాలు వినియోగించి 3,785 నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లను అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. గత ఏడాది సెప్టెంబరు 10న రాము వద్ద 28 తెలంగాణ రాష్ర్టానికి చెందిన నాన్ డ్యూటీ పెరుడ్మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
అదేనెల 22న తెలంగాణ, గోవా రాష్ర్టాల నుంచి అక్రమంగా తరలిస్తున్న 4466 క్వార్టర్ బాటిళ్లు, 300 ఫుల్ బాటిళ్లను, ఒక లారీని స్వాధీనం చేసుకున్నట్టు అర్బన్ ఎస్పీ వెల్లడించారు. ఎన్నిసార్లు అరెస్టు చేసినా మద్యం స్మగ్లింగ్కు పాల్పడుతుండటంతో పీడీ యాక్టుకు జిల్లా కలెక్టర్కు సిఫార్సు చేసినట్టు అర్బన్ ఎస్పీ తెలిపారు.
తమ ప్రతిపాదనలను పరిశీలించిన కలెక్టర్ పీడీ యాక్టు అమలుకు ఆదేశాలిచ్చినట్టు ఎస్పీ చెప్పారు. జిల్లాలో పీడీ యాక్టు ప్రయోగించటం ఇదే మొదటిసారి అన్నారు. సమావేశంలో నరసరావుపేట, గుంటూరు ఎస్ఈబీ సూపరింటెండెంట్లు చంద్రశేఖరరెడ్డి, అన్నపూర్ణ, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.