ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భూమి కుంగిపోతున్న జోషిమఠ్ నగరంలో మొత్తం 678 భవనాలు ఇప్పటి వరకు దెబ్బతిన్నాయి. సురక్షితంగా లేని భవనాల సంఖ్య నిరంతరంగా పెరుగుతోంది. సీబీఆర్ఐ బృందం మలారి ఇన్, మౌంట్ వ్యూ హోటల్ లలో పరిస్థితిపై సర్వే చేసింది. నేడు ఈ రెండు హోటళ్ల నుంచి భవనాల కూల్చివేత ప్రారంభం కానుంది. ఈ హోటళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ రెండు హోటళ్లను ముందుగా పరిశీలన చేయాలని బోర్డ్ ఆఫ్ ట్రేడ్ నిర్ణయించింది.
హోటల్ మలారి ఇన్ యజమాని ఠాకూర్ సింగ్ రాణా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో తనకు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. తన హోటల్ ను ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కూల్చివేస్తున్నారనే విషయం తనకు తెలుసునని దానికి తాను సహకరిస్తానని ఆయన చెప్పారు. అయితే ముందుగా తనకు నోటీసు ఇవ్వాలని తర్వాత తన ఆర్థిక అవసరాలను తీర్చాలని ఆయన కోరారు. అప్పుడు తాను అక్కడ నుండి వెళ్లిపోతానని ఠాకూర్ తెలిపారు.
జోషిమఠ్లో పగుళ్లు ఎక్కువగా ఉన్న హోటళ్లు, ఇళ్లను కూల్చివేసే పనులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. పరిపాలన అన్సేఫ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాలను ఖాళీ చేయించారు. హోటల్ మలారి ఇన్ను కూల్చివేస్తామని ఎస్డిఆర్ఎఫ్ కమాండెంట్ మణికాంత్ మిశ్రా తెలిపారు. ఇది దశలవారీగా తొలగించబడుతుంది. ఈ హోటళ్లు పూర్తిగా కుంగిపోయి వంకరగా మారాయి. వీటి పరిసరాలలో చాలా ఇళ్లు, హోటళ్లు ఉండడంతో మరీ ఎక్కువగా వంగిపోతే అన్నీ కూలిపోయే ప్రమాదం ఉన్నందున వీటిని పగలకొట్టాల్సిందేనని అధికారులు నిర్ణయించారు.
జోషిమత్ సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా జాబితా లో చేర్చి సుప్రీంకోర్టు పరిశీలించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఈ అంశం పై విచారణ జరపనున్నది. జోషిమఠ్ లో ఇళ్ల తొలగింపు, కూల్చివేతలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికార యంత్రాంగం తమ ఇళ్లను బలవంతంగా ఖాళీ చేయిస్తోందని లక్ష్మీప్రసాద్ అనే వ్యక్తి చెప్పారు.