బీహార్ శాసనసభఎన్నికలతో పాటు మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మణిపూర్ తో సహా 11 రాష్ట్రాలలో 59 స్థానాలకు నిర్వహించిన ఉపఎన్నికలలో బీజేపీ తిరుగులేని విజయం సాధించింది.
బిహార్ లో బీజేపీ 110 నియోజకవర్గాలలో పోటీచేసి 73 స్థానాలు కైవసం చేసుకోవడం పరిశీలకుల దృష్టి ని ఆకర్షించింది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జనతాదళ్ (యు)115 చోట్ల అభ్యర్థులను నిలబెట్టగా కేవలం 43 స్థానాలలో మాత్రమే గెలుపు సాధ్యమై…. అనూహ్యంగా మూడోస్థానానికి పడిపోయింది.
జేడీయూ విజయానికి చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ ప్రతిబంధకంగా అడ్డుపడినట్లు
విశ్లేషకులు భావిస్తున్నారు.
కనీసం 30 స్థానాలలో ఎల్ జే పీ అభ్యర్థులు జేడీయూ ఓట్లకు గండికొట్టినట్లు తేలింది.
మహాకూటమికి నేతృత్వం వహించిన యువనేత తేజస్వి యాదవ్ ప్రభావం ఈ ఎన్నికలలో బలంగానే పనిచేసింది.
మహాకూటమిలో సమర్ధనాయకత్వం లోపించడం, కూటమిలో ఏకాభిప్రాయం లేని భాగస్వామ్యపక్షాలు, తేజస్వి యాదవ్ఒం టరిపోరాటం వంటి అంశాలు రాష్ట్రీయజనతాదళ్నుఅధికారపీఠానికి దూరంచేశాయి.
ఇదిలా ఉండగా…బీహార్ లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు పూర్తి భిన్నంగా ఎన్నికలలో ఎన్ డీ ఏ సంపూర్ణ మెజారిటీ సాధించడం విశేషం.
బ్రహ్మపదార్ధం వంటి ఓటర్లనాడి
పట్టుకోవడం ఆషామాషీ కాదని ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకులకు మరోసారి తెలిసొచ్చింది. అయితే రాష్ట్రీయజనతాదళ్ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందన్నఎగ్జిట్ పోల్స్ అంచనా వాస్తవం కావడం గమనార్హం.
విజయానికి దోహదం..
బీహార్ తో సహా పలుచోట్ల బీజేపీ విజయం సాధించడానికి కారణాలు రాజకీయవర్గాలలో సంచలనం రేపుతున్నాయి. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కేంద్రం తీసుకున్న అనాలోచిత సుదీర్ఘ లాక్ డవున్…తదనంతర చర్యలు, వివాదాస్పద వ్యవసాయ సంస్కరణ బిల్లులు, అధికధరలు, నిరుద్యోగం, ఆర్ధిక రంగ తిరోగమనం, పసలేని ఆర్ధిక ప్యాకేజి లు వంటి కీలక అంశాలు తాజా ఎన్నికలలో ప్రభావం చూపగలవని ఆశించిన ప్రతిపక్షపార్టీలు ఫలితాలతో భంగపడ్డాయి.
ప్రధాని వ్యక్తిగత ఆకర్షణ ముందు ప్రతి పక్షాలు నిలవడం ఇప్పటిలో సాధ్యం కాదని రాజకీయపండితులు అంటున్నారు.
ఇవే తరహా ఫలితాలు రానున్న పశ్చిమబెంగాల్ ఎన్నికలతో సహా మిగిలినచోట్ల కూడా ప్రతిఫలించే అవకాశం ఉందని
బీజేపీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
‘ సబ్ కా సాథ్…సబ్ కా వికాస్ ‘
మోదీ మంత్రానికి ఇప్పట్లో
తిరుగులేదంటున్న పరిశీలకుల
వ్యాఖ్యలు గమనీయం.