మంగళగిరి పట్టణంలో ఆశీల పేరుతో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. చిరు వ్యాపారుల నుండి ఆశీల రూపంలో వసూలు చేసుకునేందుకు హక్కు లు పొంది నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. తోపుడు బండ్లు,ఆకు కూరల వ్యాపారుల వద్ద ఇష్టారాజ్యంగా వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.అయినా అధికారులు పట్టించుకోవటం లేదు.
దీపావళి సందర్భంగా పట్టణంలోని మెయిన్ బజార్ లో తోపుడు బండ్లపై ప్రమిధలు పెట్టి వ్యాపారం చేసే వారి వద్ద రూ.200 నుండి 300 డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం రూ.20 మాత్రమే వసూలు చేసి రసీదు ఇవ్వాలి. కానీ ఇష్టమొచ్చిన ధరల్ని వసూలు చేస్తూ, రశీదు ఇవ్వటం లేదని పలువురు వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.
కోవిడ్ నిబంధనల నేపథ్యంలో అసలే వ్యాపారులు చితికి పోయారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అందులోనూ చిరు వ్యాపారుల నుండి రూ.వందల్లో డిమాండ్ చేస్తే ఎక్కడ నుంచి తెచ్చి కట్టాలని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, విచారించి ఆశీల వసూళ్లలో నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకొని దోపిడీకి అడ్డు కట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.