మిర్చి రైతులకు నష్టపరిహారం ఎకరాకు రూ. లక్ష చొప్పున చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి డిమాండ్ చేశారు. భద్రాచలం నియోజకవర్గంలో పొంగులేటి పర్యటించారు. పర్యటనలో భాగంగా వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లోని గ్రామాలను నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావ్ తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా చర్ల మండలంలోని జీపీ పల్లిలో అకాల వర్షాలకు పంటనష్టపోయిన మిర్చి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు భద్రాచలం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మిర్చి పంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో ఎకరానికి రూ.4లక్షలు చెల్లించి పంట వేస్తే పంట చేతికి రాకముందే దెబ్బతినడం బాధకరం అని విచారం వ్యక్తం చేశారు.