వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వినాయక విగ్రహాలు తయారు చేసేవారు వాపోతున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో గత కొన్ని సంవత్సరాలుగా డా॥ కొండపల్లి వెంకటేశ్వర్లు హాస్పిటల్ వెనుక, సమీపంలోని 2 ఎకరాల స్థలంలో వినాయక ఉత్సవ విగ్రహాలను పెద్దఎత్తున తయారుచేస్తున్నారు. దాదాపు 50 మంది వర్కర్స్ ఈ విగ్రహాల తయారీలో పని చేస్తున్నారు.
కోవిడ్ కారణంగా గత ఏడాది కూడా ప్రభుత్వం వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వకపోవడంతో ఆర్ధికంగా ఎంతో నష్టపోయామని వారు అన్నారు. పెట్టుబడులు వడ్డీలకు తేవడంతో అప్పులిచ్చిన వారు తమ భాకీలు తీర్చమని వత్తిడి తెస్తున్నారన్నారు.
అయితే ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వకపోవడంతో ఏంచేయాలో పాలుపోవడం లేదన్నారు. దాదాపు 1 కోటి 30 లక్షల రూపాయలను వడ్డీలకు తెచ్చి ఈ విగ్రహాల తయారీపై పెట్టుబడులు పెట్టామన్నారు. వేలాది విగ్రహాలు ఇక్కడ తయారై వున్నాయన్నారు.
ఇప్పటికే కరెంటు బిల్లులు, జీతాలు, అద్దెలు ఇతర ఖర్చులను ప్రతినెలా చెల్లిస్తూ నిండామునిగి పోయామన్నారు. ఇక ఇక్కడ తయారు చేసిన విగ్రహాలు ఈ ఏడాది కూడా అమ్ముడవకపోతే, పెట్టుబడులు రాక, భాకీలు తీర్చలేక తాము ఆత్మహత్యలే చేసుకోవాల్సిందేనని వారు తీవ్ర భయాంధోళనలు వ్యక్తం చేస్తున్నారు.