ప్రత్యేక హోదా తీసుకురావడం చేతకాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్తాలేని సవాళ్లు విసురుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి అన్నారు.
ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ ఎంపీల రాజీనామా కోరుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీకి చెందిన పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజుతో కూడా తెలుగుదేశం పార్టీ వారే రాజీనామా చేయించాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదమని సుధాకర్ రెడ్డి అన్నారు.
వారి పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడితో తెలుగుదేశం పార్టీ రాజీనామా ఎలా చేయిస్తుందో కూడా తెలియని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆయన అన్నారు.
తమ పార్లమెంటు సభ్యులను గెలిపిస్తే మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన జగన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పి తప్పుడు కబుర్లు చెబుతున్నారని ఆయన అన్నారు.
ఢిల్లీ వెళ్లి కాళ్ల మొక్కి వస్తున్నారని సుధాకర్ రెడ్డి తెలిపారు. తమ బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డి హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సవాల్ చేస్తే కరోనా సాకు చెప్పి జగన్ రెడ్డి పారిపోయారని సుధాకర్ రెడ్డి ఆరోపించారు.