ఇంతకాలం రాష్ట్రంలో దిశా చట్టం ఉందంటూ మహిళలను దగా చేశారన్న విషయం రమ్య హత్య కేసుతో రాష్ట్ర ప్రజలకు తేటతెల్లం అయ్యిందని, మహిళలకు న్యాయం చేస్తున్నానని నమ్మించి మోసం చేసిన ఈ ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాలని మాజీ శాసనసభ్యురాలు, తెలంగాణ సెటిలర్స్ ఫోరమ్ కన్వీనర్, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన అన్నారు.
గన్ కన్నా ముందు జగన్ వస్తారని ప్రగల్బాలు పలికినవారు ఇపుడు ఏమైపోయారని ఆమె ప్రశ్నించారు. అలాగే మహిళ కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పిన మాటలు ఏమైపోయాయి అని కాట్రగడ్డ ప్రసూన ధ్వజమెత్తారు. చరిత్రలో గొప్ప గా నిలుస్తుంది, ఆడవారి పాలిట అస్త్రం గా మారుతుంది అనుకున్న దిశ చట్టం దశ-దిశ లేకుండా పోవడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తొందరపాటు చర్యలేనని అన్నారు. మహిళ హోమ్ మంత్రి, మహిళ కమిషన్ చైర్మన్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణ పరిస్థితులకు పరిష్కారం చూపాలి ..అంతే తప్ప ప్రెస్సుమీట్ లు పెట్టి, మొసలి కన్నీరు కరిస్తే సమస్య ఎప్పటికి పరిష్కారం కాదు అని కాట్రగడ్డ ప్రసూన సూచించారు.
కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టి సాక్షి టీవీ లో, పత్రికలో దిశ చట్టం ప్రకటనలు ఇచ్చుకోవడానికి తప్ప ఎందుకు ఉపయోగపడిందో చెప్పాలన్నారు. ఒక మహిళ హోమ్ మంత్రిగా ఉండి కూడా అరవ వేలు లాగా ఉన్నారే తప్ప, పదవికి న్యాయం చేయలేని హోంమంత్రి తక్షణమే రాజీనామా చేసి కనీస గౌరవం కాపాడుకోవాలి అని కాట్రగడ్డ ప్రసూన తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపే హక్కు ప్రతిఒక్క పౌరుడికి, ప్రతి రాజకీయ పార్టీకి ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాధమిక హక్కును కూడా హరిస్తూ ప్రతిపక్ష పార్టీల నాయకులపై ఉక్కుపాదం మోపుతుందని ఆమె అన్నారు.
ఎంతకాలం తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టులు చేస్తారో చూస్తాము..కాలం ఎప్పుడు ఓకేలాగా ఉండదు…ప్రతి దానిని వడ్డీతో సహా తిరిగి చెలిస్తాం…అని ఆమె హెచ్చరించారు. దేశానికి స్వాతంత్య్రం రాక మునుపు బ్రిటీష్ వారు వ్యవహరించిన తీరుకంటే ఘోరంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజా ఉద్యమాలను అణిచివేయాలనుకోవడం మూర్ఖత్వం అని గుర్తుపెట్టుకో జగన్ మోహన్ రెడ్డి అని ఆమె అన్నారు.