మహిళలు అన్నిరంగాల్లో రాణించాలనే ఉద్దేశం తో ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి ఈరోజు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో స్వయం సహాయ సంఘాల ఆధ్వర్యంలో నడిచే పిజ్జా కార్నర్ కు ప్రారంభోత్సవం చేశారు. ఫోన్ నెంబర్ 7702027826 కు చెబితే పిజ్జా డోర్ డెలివరీ చేస్తారు.
హైదరాబాద్ లోనే కాకుండా మారుమూల జిల్లా అయిన ములుగు జిల్లా లో కూడా పిజ్జా కార్నర్ ఏర్పాటు చేయడం విశేషం. ఇదే స్ఫూర్తి తో మండలాల వారీగా కూడా పిజ్జాకార్నర్ లు స్థాపించాలని, మహిళా సంఘాల ద్వారా జీవనోపాధికై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అన్నారు.
ఈ సందర్భంగా డి ఆర్ డి ఓ పిడి పారిజాతం మాట్లాడుతూ గతంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో 3లక్షల 50వేలు రుణం అందించి వారికి అన్నపూర్ణ క్యాంటీన్ ను ఏర్పాటు చేయించామని తెలిపారు.
ప్రస్తుతం వారికి 1లక్ష రూపాయల అదనపు రుణం కల్పించి పిజ్జా కార్నర్ షాపులను ఏర్పాటు చేయిస్తున్నామని అన్నారు. ములుగు జిల్లాలోనే ఇది మొట్టమొదటి పిజ్జా కార్నర్ అని ఆమె తెలిపారు.
ములుగు జిల్లా ప్రజలకు స్వచ్చమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో మహిళా సంఘాలచే ఈ క్యాంటీన్, పిజ్జా కార్నర్ ను ప్రారంభించామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఆర్వో రమాదేవి, జడ్పీ సీఈఓ ప్రసూనరాణి, ఎంఆర్ఓ సత్యనారాయణ స్వామి, శ్రీనిధి మేనేజర్ అరుణ్ సింగ్, ఏపిడి శ్రీనివాస్, డిపిఎం లీలాకుమారి, ఏపిఎం వేణుగోపాల రావ్, సిబ్బంది మరియు మహిళలు పాల్గొన్నారు.
కె మహేందర్ గౌడ్, సత్యం న్యూస్