మునుపెన్నడూ లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పేదల సంక్షేమం ప్రతి పేద వాడికి అందిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పేదలకు శాశ్వత ఇళ్ళ పట్టల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 20వ డివిజన్ రామచంద్రయ్య నగర్ లో ఏళ్ళ క్రితం ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు వేసుకున్న 88 మంది పేదలకు శాశ్వత ఇళ్ళ పట్టాలను మంత్రి పువ్వాడ పంపిణి చేశారు. గూడు లేని వారు ఎన్నోఏండ్ల నుండి అభద్రతా భావంతో రామచంద్రయ్య నగర్ నిర్వాసితుల సుదీర్ఘ కల నెరవేరిందన్నారు.
ఇక్కడ నివసిస్తున్న పేదప్రజలకు ఇండ్ల పట్టాలు మంజూరు చేసే అవకాశం తనకు కలగడం చాలా ఆనందంగా ఉందన్నారు. 20ఏళ్ళ క్రితం తన సోదరుడు పువ్వాడ ఉదయ్ కుమార్ చొరవతో ఇక్కడ నివాసం ఏర్పరచుకున్న పేదలకు తన చేతుల మీదగా తెలంగాణ ప్రభుత్వం పట్టాలు ఇచ్చే అవకాశం కల్పిస్తుందని ఊహించలేదన్నారు. పేదవాళ్ళు ఎన్నో ఏళ్లుగా ఏ హక్కు లేకుండా జీవించడం కొంత బాధ కలిగించిందని అన్నారు. తాను మంత్రిగా దాదాపు 2వేలకు పైగా ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగానన్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఅర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఖమ్మం నగరంలో గుడిసెలు వేసుకుని నివాసముండి పట్టాలు లేని పేదవాళ్ళు సొంత ఇల్లు లేకుండా వుండటానికి వీలు లేదని అన్నారు. పట్టాలు ఇవ్వటమే కాదు.. GO. నెం. 58, 59లో నమోదు చేయించి హాక్కు ఇస్తామన్నారు. రాబోవు కాలంలో పట్టానే కాదు సొంత స్థలం ఉన్న వారికి ప్రభుత్వం తరుపున రూ 5 లక్షలు ఇచ్చి సొంత ఇల్లు కట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.