ఈ నెల 14, 15, 16 వ తేదీలలో ఢిల్లీలోని నిజాముద్దీన్ లోని మార్కజ్ లో జమాత్ లో ఇస్తమా జరిగిందని దీనికి దేశ వ్యాప్తంగా 2 వేల మంది హాజరయ్యారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. అక్కడ జరిగిన ప్రార్థనల్లో సామాజిక దూరాన్ని పాటించకపోవడం వల్లే అక్కడికి వెళ్లిన వారికి కరోనా సోకిందని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి 711 మంది ఈ ప్రార్థనలల్లో పాల్గొన్నట్లు గుర్తించామని తెలిపారు. రాష్ట్రం లోని అన్ని జిల్లాల నుండి అనేక మంది ప్రార్థనల్లో పాల్గొన్నారని ఉపముఖ్యమంత్రి తెలిపారు. వీరిలో ఇంకా 85 మంది ఆచూకీ తెలియల్సి ఉందని, గుర్తించిన వారందరికి రక్త పరీక్షలు జరిపి వారిని స్వీయ నిర్బంధంలో ఉంచామని తెలిపారు.
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రార్థనకు వెళ్లిన వాళ్ళు స్వచ్చందంగా ముందుకు రావాలని, వారు దయచేసి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేస్తే అధికారులు నేరుగా వచ్చి పరీక్షలు చేస్తారని ఆయన అన్నారు. ప్రొద్దుటూరు లో 7 మంది ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారు స్వచ్చందంగా ముందుకు వచ్చారని ఆయన తెలిపారు.