ఎనిమిది సంవత్సరాలు బ్రతుకుదెరువు కోసం పట్నం వెళ్లి తిరిగి వచ్చిన ఆ వ్యక్తికి 59,286 రూపాయల విద్యుత్ బిల్లు దర్శనమిచ్చింది. దాంతో లబోదిబోమంటున్నాడు ఆ వ్యక్తి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం వండ్రికల్ లెప్రసి క్యాంపులో నివాసం ఉంటున్న వన్నాల ఉప్పలయ్య 2009 సంవత్సరంలో బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్ళాడు.
వెళ్లే ముందు ఇంటికి సంబంధించిన రెండు నెలల విద్యుత్ బిల్లు పెండింగులో ఉంది. దాంతో అధికారులు వచ్చి మీటర్ వద్ద కనెక్షన్ తొలగించారు. అప్పటికే హైదరాబాద్ వెళ్దాం అనుకున్న ఉప్పలయ్య భార్యతో వెళ్ళాడు. 2017 లో తిరిగి గ్రామానికి వచ్చాడు. ఆయన ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు నీ ఇంటి బిల్లు 59 వేల 286 రూపాయలు ఉంది. వెంటనే చెల్లించాలని అడిగారు.
దాంతో అవాక్కాయిన ఉప్పలయ్య తాను ఇంతకాలం ఇక్కడ లేను కదా. తాను కరెంట్ వాడలేదు కూడా అని అధికారులకు చెప్పాడు. నువ్వు కరెంట్ వాడుకున్నట్టు మా రికార్డులో ఉంది బిల్లు కట్టాల్సిందేనని పట్టుబట్టారు. దాంతో అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసాడు ఉప్పలయ్య. అయినా ఫలితం లేదు. రెండు సంవత్సరాలుగా అధికారులను బ్రతిమలుతూనే ఉన్నాడు.
నేడు మరోసారి జిల్లా కేంద్రానికి వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ” గౌరవనియులైన కలెక్టర్ గారికి… గాంధారి మండలం వండ్రికల్ లిప్రసి క్యాంపుకు చెందిన ఉప్పలయ్య నాపేరు. 2009 లో బ్రతుకుదేరువు కోసం పట్నం వెళ్ళాను. వెళ్ళేటప్పుడు రెండు నెలల విద్యుత్ బిల్లు చెల్లించాల్సి ఉండగా అధికారులు కరెంట్ కట్ చేశారు. 2017 లో తిరిగి వచ్చేసరికి 59 వేల 286 రూపాయలు చెల్లించాలని విద్యుత్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
ఆ బాధ భరించలేక నా భార్య గత ఫిబ్రవరి నెలలో మృతి చెందింది. నాకు ఇద్దరు కొడుకులు. వ్యవసాయ కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నేను ఒక్కడినే ఉంటున్నాను. కొడుకులు పట్టించుకునే పరిస్థితి లేదు. విద్యుత్ బిల్లు అంతగా చెల్లించలేను. అప్పో సప్పో చేసి ఇటీవల 8 వేల రూపాయలు చెల్లించగలిగాను.
అంతకన్నా ఒక్క రూపాయి కూడా కట్టే స్థోమత నాకు లేదు. అధికారులు ఇలాగే వేధిస్తే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు. దయచేసి స్పందించి విద్యుత్ బిల్లు చెల్లించేందుకు నాకు ఆర్థిక సహాయం అందించగలరని నాయొక్క మనవి” అని కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు