రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నారాయణ పేట వస్తున్నారు…. మంచిదే కదా?
యువరాజు దేశం మొత్తం తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్నట్లు కేటీఆర్ కూడా రాష్ట్రం మొత్తం పర్యటిస్తుంటే కొన్ని సమస్యలు అయినా పరిష్కారం అవుతాయి కదా… అని సంతోష పడటం అటుంచి నారాయణ పేటలోని ప్రతిపక్ష పార్టీల నాయకులకు మాత్రం కేటీఆర్ రాక ఒక పెద్ద శిక్షగా మారింది.
కేటీఆర్ పర్యటనలో నిరసన తెలుపుతారని భావించిన పోలీసులు నారాయణ పేటలోని అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులను శనివారం తెల్లవారు జాము నుంచే అరెస్టు చేయడం ప్రారంభించారు. బిజెపి, సిపిఎం సిపిఐ పార్టీల నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు.
శనివారం రోజు ఉదయం 8 గంటలకు సీపీఎం, న్యూడెమోక్రసీ నాయకులను నారాయణపేట నుండి అరెస్టు చేసి దామరగిద్ద పోలీస్టేషన్ కు తరలించారు.
పలువురు నేతల్ని హౌస్ అరెస్టు చేశారు. మంత్రి కేటీఆర్ పర్యటన కు రావడం ఏమిటి మమ్మల్ని అరెస్టు చేయడం ఏమిటి అంటూ అఖిల పక్షం నాయకులు ప్రశ్నిస్తున్నారు.
మంత్రి పర్యటనకు వస్తుంటే ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి రావద్దా అంటే ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నిరంకుశ ఫాసిస్టు విధానాల వల్ల అధికార టీఆర్ఎస్ పార్టీకి తీరని నష్టం కలుగుతుందని వారు అంటున్నారు.
ప్రజావ్యతిరేకులే ఈ విధంగా ప్రవర్తిస్తారని కూడా వారు ఘాటుగా విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా లేకపోవడం దారుణమైన విషయమని అఖిలపక్షనాయకులు అంటున్నారు.