ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అంబవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అంబవరం గ్రామానికి చెందిన ఖాసింబి(6) అనే బాలిక అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందింది. నిన్న సాయంత్రం నుండి బాలిక కనిపించకపోవడంతో తండ్రి ఖాసిం వలి స్థానిక గిద్దలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
బాలిక కోసం తల్లిదండ్రులు వెతుకుతుండగా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత స్థానికులు ఇచ్చిన సమాచారంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా కన్నీరుమున్నీరయ్యారు. గ్రామ సమీపంలోని అరటి తోటలో బాలికను గోనెసంచిలో కుక్కి పడవేసి ఉండడాన్ని స్థానికులు గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సమాచారాన్ని అందుకున్న డిఎస్పి కిషోర్ కుమార్ గిద్దలూరు సిఐ ఫిరోజ్ ఎస్సై త్యాగరాజు లు సంఘటనా స్థలానికి చేరుకుని జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు. బాలికను ఎవరైనా హత్య చేశారా లేక బాలిక మృతికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.
జరిగిన ఘటనపై డిఎస్పి కిషోర్ కుమార్ స్పందిస్తూ దోషులు ఎవరైనా సరే పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని త్వరలోనే నిందితులు ఎవరో తేలుస్తామని అన్నారు