విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. అందుకు అనుగుణంగా సిబ్బందిని సైతం ప్రభుత్వం నియమించింది. కానీ అధికారుల కామ క్రూరత్వానికి సిబ్బంది బలవుతున్నారు. ఓ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సైతం చేశారు మహిళా సిబ్బంది.
కామారెడ్డి జిల్లా మద్నూర్ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న శ్రీనివాస్ తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని మద్నూర్ పిహెచ్ సి లో స్టాఫ్ నర్స్ గా పని చేస్తున్న సునీత మద్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత కొద్ది కాలంగా తనను ప్రిన్సిపల్ వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం మద్నూర్ గురుకుల పాఠశాలలో స్టాఫ్ నర్స్ గా సునీత ఏడాదిన్నరగా పని చేస్తుంది. విధుల్లో చేరిన నెల రోజుల నుంచి ప్రిన్సిపాల్ శ్రీనివాస్ సునీతను శారీరకంగా హింసించడం మొదలు పెట్టాడు. హైదరాబాద్ వెళ్లడానికి బస్సులు ఉండవని తన వెంట తీసుకు వెళ్తానంటే తండ్రిలాంటి వాడు కదా అని కారులో వెళ్లానని బాధితురాలు సునీత తెలిపింది.
కారులో వెళ్ళేటప్పుడు ముఖానికి మాస్క్ వేసుకోవాలని, తనతో వస్తున్నట్టు ఎవరితో చెప్పకూడదని చెప్పేవాడని తెలిపింది. వెనక సీట్లో కూర్చుంటే ముందు సీట్లోకి రావాలని గద్దించేవాడని ముందు సీట్లో కూర్చుంటే లైంగికంగా వేధించేవాడని వివరించింది. చెప్పుకోలేని భాషలో మాట్లాడే వాడని, తనతో కన్వినియంట్ గా ఉండాలని చెప్పేవాడని తెలిపింది. చాలా సార్లు బలవంతం చేయబోయాడని తాను మూడు నెలల గర్భిణీ అని చెప్పినా వినలేదని పేర్కొంది.
ఇలాంటి వాడిపై చర్యలు తీసుకోవాలని కోరింది. భర్త మాట్లాడుతూ.. ఆయన చెప్పినట్టు విననందుకు మెడికల్ రీ యింబర్స్ మెంట్ బిల్లు కూడా చేయలేదని తెలిపాడు. తన భార్య కోసమే ప్రత్యేకంగా సమావేశం నిర్వహించేవాడని తెలిపాడు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పై లైంగిక వేధిస్తున్నాడని సునీత అనే స్టాఫ్ నర్స్ ఫిర్యాదు చేసిందని ఎస్సై సురేశ్ తెలిపారు.