మాతృ మరణాలు జరిగితే పక్కా విశ్లేషణ ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం మాతృ మరణాల పట్ల జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మన్యం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభవించకుండా ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. మాతృ మరణాలు జరుగుటకు సౌకర్యాల లోపమా, వైద్య సేవలలో లోపమా, సామాజిక పరమైన అంశాలు ఉన్నాయా అనే కారణాలను విశ్లేషించాలని ఆయన స్పష్టం చేశారు. ఉప కమిటీ పక్కాగా విచారణ చేయాలని ఆయన ఆదేశించారు. గర్భిణీలు ప్రసవ సమయంలో మృతి చెందితే అందుకుగల నిర్దిష్టమైన కారణం కనుగొనాలని ఆయన స్పష్టం చేశారు. వైద్య సౌకర్యాలు అందుబాటు, క్లినికల్ సౌకర్యాల లభ్యత, సామాజిక విధానంలో జరిగిన తప్పులు విశ్లేషించాలని ఆయన సూచించారు. హై రిస్క్ కేసులకు స్థానిక ఆర్.ఎం.పి వైద్యులు చికిత్స అందించడం పట్ల తీవ్రంగా పరిగణించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కొన్ని మండలాల్లో హై రిస్క్ కేసులకు ఆర్.ఎం.పిలు ఐ.వి.
ఫ్లూయిడ్స్ ఇవ్వడంతో గర్భిణీల ఆరోగ్య పరిస్థితుల్లో విపరీతమైన మార్పులు వచ్చి మరణాలు సంభవిస్తున్నట్లు ఏ.ఎన్.ఎం, ఆశా కార్యకర్తలు వివరించడం పట్ల జిల్లా కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. ప్రసవాలకు వచ్చే వారి రక్తపు గ్రూప్ ముందుగా పి.హెచ్.సి స్థాయిలో గుర్తించి జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారికి తెలియజేయాలని ఆయన అన్నారు.
అవసరం మేరకు రక్తపు యూనిట్లు సిద్ధం చేయాలని ముఖ్యంగా నెగిటివ్ బ్లడ్ గ్రూప్ పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఇప్పటి వరకూ చికిత్స అందించిన నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వ్యక్తుల వివరాలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. అటువంటి కుటుంబ సభ్యులను రక్త దానానికి విజ్ఞప్తి చేయాలని ఆయన సూచించారు.