వనపర్తిలో ప్రజల తరపున ప్రశ్నించిన బీసీ నాయకులపై అనేక కేసులు పెట్టించడమే గాక, ఉద్యమకారులను పోలీసుల చేత విచక్షణా రహితంగా కొట్టించిన ఘనత కూడా మంత్రికే దక్కిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నర్సింగ్ కళాశాల భగీరథ ఫంక్షన్ హాల్లో, బిఎస్సి అగ్రికల్చర్ కళాశాల కోళ్ల ఫామ్ లలో నిర్వహించటం అభివృద్దా అని సూటిగా ప్రశ్నంచారు.
అవినీతి, అరాచక మంత్రికి ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పటానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని, నిరుద్యోగులకు అవహేళన చేసి మాట్లాడిన మంత్రి డిసెంబర్ 3న హమాలీ సభ్యత్వం తీసుకోవటానికి సిద్దంగా ఉండాలన్నారు.
10 సంవత్సరాలలో ఒక్క పేద కుటుంబానికి రేషన్ కార్డు మంజూరు చేయని బిఆర్ఎస్ పార్టీకి ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు లేదని చెప్పారు. వనపర్తి నియోజకవర్గ ప్రజలతో ఎన్నికై మంత్రి పదవి పొందిన నిరంజన్ రెడ్డి తన పదవిని అడ్డం పెట్టుకుని అభివృద్ధి పేరిట అవినీతికి,అరాచకాలకు పాల్పడ్డారని, దేవాదాయ, పెబ్బేరు సంత భూమితో పాటు కృష్ణా నదిని సైతం ఆక్రమించాడని ఆరోపించారు.
భూ ఆక్రమణ ఆరోపణలపై మీడియాను తీసుకెళ్తానని ప్రగల్భాలు పలికిన మంత్రి నేటి వరకు కూడా ఎందుకు తీసుకెళ్లలేదో ప్రజలకు చెప్పాలన్నారు. గిరిజన బిడ్డను అడ్డం పెట్టుకుని సబ్సిడీలు , కాంట్రాక్టులు, అక్రమాస్తులు కూడబెట్టుకున్న మంత్రి ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టించారని విమర్శించారు.
మంత్రి తన క్యాంపు కార్యాలయం ఖాళీ చేయకుండా, అధికారిక వాహనాలను సైతం ప్రచారానికి వాడుకుంటున్న కూడా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోకపోవటం సరికాదన్నారు. జిల్లా కలెక్టర్ సైతం డమ్మీ అయ్యారని, ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోవట్లేదన్న విమర్శలు వస్తున్నాయని, ప్రజలు కట్టిన పన్నుల ద్వారా జీతాలు తీసుకుంటూ నాయకులు చెప్పినట్టు పని చేయడం సమంజసం కాదన్నారు.
అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకొని, ఎన్నికలు సజావుగా జరపాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరారు. ఈ కార్యక్రమంలో అంజన్న యాదవ్, మురళీధర్ గౌడ్, టైలర్ కృష్ణ, తిరుపతి యాదవ్, ఎడవల్లి భాస్కర్, సత్తయ్య, రమేష్ నాయక్, కిషన్, వెంకటేష్ యాదవ్, రంగదాస్ గోపాల్ యాదవ్ పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్