కరోనా వైరస్ బాధితులు మన రాష్ట్రంలో మొదలైన దగ్గర నుండి మా ఉద్యోగ విధులలో మార్పులు రావడం మొదలైంది. మా హైదరాబాద్ పోలీస్ కమిషనర్, మా డిజీపీ, ఇతర అధికారులు సెట్ కాన్ఫరెన్స్ లు, వీడియో కాన్ఫరెన్స్ లు పెట్టి ఎప్పటికప్పుడు ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకునే జాగ్రత్తలు చెబుతూ వచ్చారు.
మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెబుతున్నారు. జనతా కర్ఫ్యూ రోజు ఉదయమే డ్యూటీలోకి వచ్చి మేం మా పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్లపై తిరుగుతున్న ప్రజల్ని ఇళ్ళలోకి వెళ్లి ఉండాలని నేను, నా సిబ్బంది వేడుకున్నాం. కొంత మంది హాస్పిటల్ కు వెళ్లాలని, మరి కొంత మంది మెడికల్ షాప్ కు వెళ్లాలని బయటకు వస్తూనే ఉన్నారు.
వెళుతూనే ఉన్నారు. కరోనా వైరస్ గురించి మైకు లో చెబుతూ ప్రతి కాలనీలో తిరిగాం. అనవసరంగా రోడ్లపై తిరిగే వాళ్లపై కేసులు బుక్ చేశాం. ఐనా కానీ కొంత మంది బాధ్యత లేకుండా రోడ్ల పై తిరిగారు.
21 రోజులు లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి డ్యూటీలోనే ఉన్నాం. లాక్ డౌన్ పాటించాలని, బయటికి రావద్దని ప్రజలకు చెబుతూ ఉన్నాం. ఏదో మెడికల్ స్లీప్ తీసుకొని రోడ్లపైకి వస్తున్నారు. వారి వల్ల నిజమైన రోగులకు ఎబ్బందులు ఎదురైతున్నాయి.
ఇంకొంత మంది కూరగాయలకు అనీ, కిరణ షాప్ కు అనీ, హాస్పిటల్ కు అని వస్తున్నారు. వారిలో నిజమైన వారు ఎంత మంది ఉన్నా రో తెలియదు కొన్ని వీధులలో కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని రోడ్ల పైకి వదులుతున్నారు. అది మంచిది కాదు అని చెప్పినా వినడం లేదు.
డ్యూటీ కి వచ్చినప్పటి నుండి 2, 3 గంటలకు చేతులు కడుక్కోవడం, శానిటైజర్ వాడటం, ముఖానికి మాస్క్ ధరించి కాలనీల్లో తిరగడం చేస్తున్నాను. ఏదైనా వస్తువును పట్టుకోవాలంటే ఒకటికి రెండు సార్లు అలోచించాలల్సిన పరిస్ఠితి. ఎవరిని నమ్మాలో తెలియని స్థితి. ఒక్కో సారి నా పై నాకే అనుమానం.
ఇలా ఎన్నో ఒడిదుడుకులను గురై ఉద్యోగాన్ని ముగించుకొని ఇంటికి వెళ్ళాలా వద్దా అని ఎటు తేల్చుకొని స్థితి. నా భార్యకు ఫోన్ చేసి నేను ఇంటికి రాను, నీవు పిల్లలు ఇంటి దగ్గరే ఉండండి అని చెబితే వాళ్ళు బాధ పడ్డారు. ఇంటికి వచ్చేయమని బలవంతం చేస్తే ఏ మధ్య రాత్రో భయంగా ఇంటికి వెళ్లా.
ఇంట్లోకి నేరుగా వెళ్లకుండా ఇంటి వెనక వైపుకు వెళ్లి నా దగ్గర ఉన్న వైర్లెస్ సెట్, వాచ్, సెల్ ఫోన్స్, ఛార్జర్స్, హెల్మెట్, టిఫిన్ బాక్స్ బ్యాగ్ దూరంగా పెట్టాను. నా వంటి పైన ఉన్న దుస్తులు తీసి వేసి వాటిని డెటాల్ నీళ్లలో ఉంచి, వాటిని ఉతికి అరవేసి, వేడి నీళ్ళతో స్నానం చేసి, నాకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న గదిలో, ప్రత్యేకంగా పెట్టుకున్న దుస్తులు ధరించాను.
నా చేతులకు శానిటైజర్ రాసుకొని, నా సెల్ ఫోన్స్, వాచ్, ఛార్జర్స్, కీస్, వైర్ లెస్ సెట్ హెల్మెట్ లను క్లీన్ చేసుకొని ఇంట్లోకి వెనక డోర్ నుండి అడుగు పెట్టాను. నా ఇద్దరు పిల్లలు పడుకున్నారు. వారిని దూరం నుండి చూసి, అన్నం తిని, నా సపరేట్ గదిలో నిద్ర పోతున్నాను.
ఉదయం నా పిల్లలు నిద్ర లేచి నా దగ్గరకు వచ్చి డాడీ డాడీ అని నన్ను నిద్రలేపారు. నేను వారిని దూరంగా ఉండండి అని అంటే వాళ్లు అమాయకంగా ఎం డాడీ ఏమైంది? ఎందుకు దూరం ఉండాలని అంటున్నావు? అని ప్రశ్నిస్తున్నారు. వారిని దగ్గరకు తీసుకోలేక దూరం వుంచలేక పడే బాధ చెప్పలేనిది.
ఇంట్లోకి ఏ వస్తువు తీసుకొచ్చిన దాన్ని డెట్టాల్ తో కడిగి వాడాల్సిన పరిస్థితి. పాల పాకెట్స్, పెరుగు పాకెట్స్, కూరగాయలు, పళ్ళు అన్నీ డెట్టాల్ వాటర్లో స్నానం చేయ్యానిది ఇంట్లోకి వెళ్లవు. న్యూస్ చూసినప్పుడల్లా ప్రపంచ దేశాలలో, భారత దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల లో పెరిగే కరోనా పాజిటివ్ కేసుల గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితి.
అన్ని రంగాల్లో ముందు ఉన్న దేశాలు కరోనా వైరస్ ధాటికి విల విల లాడుతున్నాయి. అందుకే మన దేశం పరిస్థితి ఆలోచించండి. పోలీస్, డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్, పారిశుధ్య కార్మికులు ఇతర రంగాల వాళ్ళు అవిశ్రాంతంగా పని చేస్తున్నారు.
దయ చేసి ఇంటి బయటకు రాకండి, ఇంటి దగ్గరే ఉండండి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుకోండి. ప్రభుత్వాలు ఇస్తున్న సూచనలు, సలహాలు పాటిస్తూ ఉండండి. ఈ మందు లేని భయంకర కరోనా వైరస్ ను అంతమొందిద్దాం రండి.
కేశవ్, సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కామాటీపురం పోలీస్ స్టేషన్, హైదరాబాద్.