జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కృష్ణాయపాలెం నుంచి మందడం మీదుగా మంగళగిరి వెళ్తుండగా మందడం సమీపంలో పవన్ కల్యాణ్ ను పోలీసులు అడ్డుకున్నారు. నేరుగా తుళ్లూరు వెళ్లాలని సూచించారు. కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా తాళ్ల సాయంతో పోలీసులు అడ్డుకోవడంతో స్థానిక రైతులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో పవన్ అభిమానులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దాదాపు 200 మంది పోలీసులు రోడ్డుకు అడ్డంగా ఇనుప కంచె వేసి, పొక్లెయిన్ అడ్డుగా పెట్టి కాన్వాయ్ ముందుకెళ్లకుండా చేశారు. దీంతో భారీగా ఉన్న జనసేన కార్యకర్తలు, రైతులు ఇనుప కంచెను తొలగించి పవన్ ముందుకు సాగేందుకు మార్గం సుగమం చేశారు. పవన్ కారు దిగి కాలినడకన మందడం బయల్దేరారు.
ఈ సందర్భంగా పవన్ అభిమానులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పవన్ను అడ్డుకున్న ప్రదేశం నుంచి మందడం గ్రామం నాలుగుకిలోమీటర్ల దూరంలో ఉంది. పాదయాత్రగా మందడం వెళ్తానని, తనను ఎవరు అడ్డుకుంటారో చూస్తానని ఈ సందర్భంగా పవన్ హెచ్చరించారు.