పులి, సింహం, ఏనుగు అంటూ 55 నెలల పరిపాలనా కాలంలో బీరాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆఖరికి పిల్లి తన పిల్లలను ఏడు చోట్లకు మార్చుకున్నట్లు, వైకాపా ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మారుస్తున్నారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఎద్దేవా చేశారు. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థిని జిల్లాలో ఆ మూల నుంచి ఈ మూలకు, ఎంపీ అభ్యర్థలను రాష్ట్రంలో ఈ మూల నుంచి ఆ మూలకు విసిరేయటంతో ఆత్మగౌరవం ఉన్న అభ్యర్థుల వాపోతున్నారని, పదవులు దక్కితే చాలు అనుకునే వారు తాడేపల్లి చుట్టూ తిరుగుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ముందు తమ అభిప్రాయాలను చెప్పలేక నిస్సహాయంగా పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మేందుకు కూడా కొందరు సిద్ధ పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి శ్రద్ధ చూపని ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అభ్యర్థులపై చూపటం అధికార దాహార్తి కి నిదర్శనంగా అభివర్ణించారు. ఎన్ని ప్రయోగాలు చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమే అంటూ బాలకోటయ్య అభిప్రాయపడ్డారు.