ఢిల్లీలోని ఆర్మీ ఆర్ అండ్ ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఇటీవల బ్రెయిన్ క్లాట్ కోసం ప్రణబ్ ముఖర్జీ సర్జరీ చేయించుకున్నారు.
ఆపరేషన్ సమయంలో ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. 1935 డిసెంబర్ 11న పశ్చిమబెంగాల్లో జన్మిచిన ప్రణబ్ ముఖర్జీ 1969లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1969 మిడ్నాపూర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఆయన విజయం సాధించారు.
34 ఏళ్లకే కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ప్రణబ్ ముఖర్జీ ఎన్నికయ్యారు. 1973లో కేంద్ర కేబినెట్ మంత్రిగా ఎంపిక అయ్యారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీకి నమ్మినబంటుగా ప్రణబ్ ఉండేవారు. 1975, 1981, 1993, 1999లో వరుసగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
1991లో ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ గా పని చేశారు. 1998లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా ఎన్నిక కావడంతో కీలకపాత్ర పోషించారు. 2004లో తొలిసారి లోక్ సభకు ఎన్నికైన ప్రణబ్ ముఖర్జీ 2012 వరకు యూపీఏ ప్రభుత్వంలో నెంబర్ 2గా గుర్తింపు పొందారు.
కీలకమైన రక్షణ, విదేశాంగ, ఆర్థిక, వాణిజ్య శాఖలు నిర్వహించిన ప్రణబ్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థికమంత్రిగా గుర్తింపు పొందారు. 2008లో పద్మ విభూషణ్, 2019లో భారతరత్న అందుకున్నారు. 2012లో దేశ 13వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.