రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సీఎస్ నీలం సాహ్ని, సీసీఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ప్రసాద్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ అండ్ ఐజీ సిద్థార్థజైన్తో పాటు పలువురు అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో ప్రయోగాత్మకంగా చేపట్టిన భూ సర్వే వివరాలను సమావేశంలో అధికారులు సీఎం కు వివరించారు. గతంలో కమతాలు 182 కాగా ఇప్పుడు 631 కమతాలు ఉన్నాయని వెల్లడి. వాస్తవానికి కమతాల సంఖ్య కన్నా సర్వే నెంబర్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
631 కమతాలకు 829 సర్వే నంబర్లు ఉన్నాయని చెప్పారు. రికార్డుల స్వచ్ఛీకరణ (ప్యూరిఫికేషన్) రైతులకు మరింత మేలు చేస్తుందనr అధికారులు వివరించారు. దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్యలు పారదర్శకత వల్ల తీరిపోతాయని, రైతుకు పూర్తి హక్కులు దఖలు పడతాయని అధికారులు వెల్లడించారు.
సర్వే సందర్భంగా తలెత్తే సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించేందుకు మొబైల్ ట్రైబ్యునల్స్ ఉంటాయని సమావేశంలో అధికారులు వెల్లడించారు. వివాదాలకు తావు లేకుండా భూ సమస్యలను పరిష్కరించడానికి ఆ ట్రైబ్యునల్స్ సహాయ పడతాయని వారు తెలిపారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమగ్ర భూ సర్వే చేస్తున్న తొలి రాష్ట్రం మనదే అని పేర్కొన్నారు. గ్రామ సచివాలయంలో సబ్ రిజిస్ట్రార్ సేవలు అందాలని సీఎం ఆదేశించారు.
దీని వల్ల రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయని, ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా ఎప్పటికప్పుడు వివరాలు నమోదు అవుతాయని అన్నారు. అంతే కాకుండా ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని సీఎం అన్నారు.