రోజుకో నిర్ణయం… పూటకో యవ్వారంతో తాను తికమకలో పడుతూ దేశంలోని రాజకీయ నాయకులను తికమక పెడుతున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాను రాజకీయ పార్టీ పెట్టడం లేదని ప్రకటించాడు. బీహార్లో ఇప్పట్లో ఎన్నికలు లేవని, అందుకే ఇప్పుడు పార్టీ పెట్టే ప్రసక్తే లేదన్నారు.
వచ్చే మూడు-నాలుగేళ్లలో బీహార్ ప్రజలకు తాను చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తానని ఆయన వెల్లడించారు. 30 ఏళ్ల లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ ల పాలన తర్వాత కూడా బీహార్ దేశంలోనే అత్యంత వెనుకబడిన, పేద రాష్ట్రం గా ఉందని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
అనేక అభివృద్ధి సూచికలలో బీహార్ ఇప్పటికీ దేశంలోనే అట్టడుగు స్థాయిలోనే ఉందని ఆయన అన్నారు. రానున్న కాలంలో బీహార్ అగ్రగామి రాష్ట్రాల జాబితాలోకి రావాలంటే అందుకు కొత్త ఆలోచన, కొత్త ప్రయత్నాలు అవసరమని ఆయన తెలిపారు.
అందుకే ప్రస్తుతం తాను ఏ రాజకీయ పార్టీ పెట్టబోనని, అయితే 17 వేల మందితో మాట్లాడతానని చెప్పారు. ప్రజలందరూ కొత్త పార్టీని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటే, అప్పుడు పార్టీని ఏర్పాటు చేస్తానని ఆయన అన్నారు. అయితే తాను స్థాపించబోయే పార్టీ తనది మాత్రమే కాదు. దానికి సహకరించే వారందరిదీ అయి ఉంటుంది. అంచెలంచెలుగా కలిసి నడుస్తాం అని ఆయన అన్నారు. అక్టోబర్ 2 నుండి బీహార్లో 3,000 కి.మీ ‘పాదయాత్ర’ను కూడా ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.