ఈ నెల 30న 8, 9వ తరగతి విద్యార్థులకు రాష్ట్రస్థాయి సామర్థ్య పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని బిచ్కుంద మండల విద్యాధికారి రాములు నాయక్ సూచించారు. బిచ్కుంద మండల కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.
ఈనెల 30వ తారీఖున ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ఓఎమ్ ఆర్ షీట్ విధానం ద్వారా స్టేట్ లెవెల్ అసెస్మెంట్ సర్వే పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, కేజీబీవీ, గురుకుల పాఠశాల 8, 9వ తరగతి 944 విద్యార్థులు ఈ పరీక్షలలో పాల్గొంటారని అన్నారు. విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను ఫీల్డ్ కవర్లో భద్రపరిచి అదే రోజు మూడు గంటల లోపు మండల విద్యాధికారి కార్యాలయంలో అందజేయాలనీ, జవాబు పత్రాలను జిల్లా విద్యాధికారి కార్యాలయంలో 5 గంటల లోపు పంపుతామన్నారు.
పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులదే అన్నారు. విద్యార్థులు పాఠశాలకు 100% హాజరయ్యేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు కిషోర్, శ్రీకాంత్, సుభాష్, మల్లికార్జున్, హలీం ఉన్నిసా , మమత, అరుణ్, శంకర్, బాలు ఉన్నారు.