భారతీయ జనతా పార్టీ జాతీయవాదం సమైక్యవాదo అనే నినాదంతో ముందుకు సాగుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. సోమవారం నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఉపాధ్యక్షులు మహమ్మద్ యూసుఫ్ ఉల్ ఘని న్యూఢిల్లీలోని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నివాసంలో ఆయన సమక్షంలో బిజెపిలో చేరారు. ఆయనతో పాటు రాష్ట్ర మైనార్టీ బిజెపి అధ్యక్షుడు అప్సర్ పాషా, నాగర్ కర్నూల్ జిల్లా బిజెపి అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు, నాగర్ కర్నూల్ జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు దాచేపల్లి ప్రవీణ్ కుమార్ ఉన్నారు.
కొల్లాపూర్ నివాసి అయిన మహమ్మద్ యూసుఫ్ ఉల్ ఘని హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కొనసాగుతున్నారు. దాదాపు సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆరు నెలలుగా బిజెపి నాయకులతో, మైనార్టీ నాయకులతో ఆయన టచ్ లో ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించి కాంగ్రెస్ పార్టీ చేసేది ఏమీ లేదు అన్న ఉద్దేశంతో దీర్ఘకాలంగా చర్చల అనంతరం సోమవారం ఢిల్లీలో ని బండి సంజయ్ నివాసంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.
మహమ్మద్ బీజేపీలో చేరడంతో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అభినందించి పార్టీలో ముందుకు సాగాలని దీవించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ ముందుకు సాగాలని తన వంతు పూర్తిస్థాయి సహాయ సహకారాలు ఉంటాయని బండి సంజయ్ ఈ సందర్భంగా ఘని కి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బిజెపి పార్టీ అందరు పార్టీ అని అన్ని వర్గాల ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని బిజెపి జాతీయ వాదం సమైక్య వాదం అనే నినాదంతోనే ముందుకు సాగుతుందన్నారు.
నేడు దేశ ప్రజల చూపంతా బిజెపి వైపు ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బిజెపిలో చేరడానికి ముందుకు వస్తున్నారన్నారు. బిజెపి విధానాలు నచ్చి భవిష్యత్తులో బీజేపీ వల్లే దేశానికి మంచి జరుగుతుందని భావించి పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏలేది బిజెపి ప్రభుత్వమే అని ఆయన అన్నారు. బిజెపిలో చేరే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.