జరుగుతున్న దొంగతనాలు పై ప్రత్యేక దృష్టి సారించి, నివారణకు చర్యలు తీసుకోవాలని తిరుపతి అర్బన్ యస్.పి వెంకట అప్పల నాయుడు ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రతీ పోలీస్ స్టేషన్ నుంచి అనుభవం కలిగి, ప్రత్యేక శిక్షణ పొందిన ఇద్దరు కానిస్టేబుళ్లను ఎంపిక చేసి ఒక బృందంగా ఏర్పాటు చేసి వారిద్వారా దొంగతనాలకు చెక్ పెట్టే సృజనాత్మక ఆలోచనకు కార్యరూపం దాల్చాలన్నారు.
ఇందులో భాగంగా బుధవారం డి.యస్.పి లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా యస్.పి అధికారులతో దొంగతనాలను అరి కట్టడానికి అవసరమైన చర్యలపై చర్చించారు. దొంగతనం జరిగిన వెంటనే కేసు నమోదు చేసి అంతటితో సరిపెట్టుకోక, ఆధారాల సేకరణ లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలని అన్నారు. ప్రజలు, వ్యాపార సంస్థల నడుపుతున్న వారు ఇతరత్రా వ్యక్తులలో దొంగతనాలు అరికట్టడం పై అవగాహన కల్పించడం, ఇంటికి తాళం వేసి బయట ఊరు వెళ్లేటప్పుడు ఎల్.హెచ్.ఎం.ఎస్ (లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం) ఏర్పాటు చేసుకోవడం వంటి విషయాలపై చైతన్య పరచడం ఇలాంటి చర్యలు తరచుగా చేపట్టాలన్నారు.
అర్బన్ పోలీస్ జిల్లా పరిధిలో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలి. అందులో ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి అనుభవం కలిగి, వేలిముద్రల సేకరణ వంటి విషయాలలో ప్రత్యేక శిక్షణ పొందిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఉంటారు. ఈ బృందం ఒక డి.ఎస్.పి పర్యవేక్షణలో ఉంటుంది. దొంగతనం జరిగిన వెంటనే క్లూస్ టీమ్ చేరుకునేలోపే ఈ బృందం సాధ్యమైనంత మేర ఆధారాలను సేకరిస్తుంది.
అర్బన్ పోలీస్ జిల్లా పరిధిలోని పాత నేరస్తుల ఇళ్లను జియో ట్యాగింగ్ చేయడం, దీని ద్వారా ఆ నేరస్థుడి వివరాలను, అతని ఇల్లు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో గుర్తించడం, దీనివలన ఇక్కడి నేరస్తుడు ఇతర రాష్ట్రాలలో నేరాలకు పాల్పడినప్పుడు గుర్తించడానికి వీలవుతుంది. ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్.పి లు అడ్మిన్ ఇ.సుప్రజ, లా&ఓ అరిఫుల్లా, జిల్లా లోని డి.యస్.పి, సి.ఐ లు, యస్.ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.