కుల వివక్షతతో విద్యార్థులను వేధిస్తున్న వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం గొట్లపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గాయత్రిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ PDSU, KVPS ఆధ్వర్యంలో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం గొట్లపల్లి గ్రామ సమీపంలో గల మోడల్ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులను ప్రిన్సిపాల్ గాయత్రి వేధింపులకు గురి చేస్తూ కులవివక్షతో దూషిస్తున్నదని విద్యార్థులు ఆరోపించారు.
ప్రిన్సిపల్ గాయత్రి మరికొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థులను అసభ్య పదజాలంతో దూషిస్తూ, వాళ్లు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నట్లు విద్యార్థులు తెలిపారు. ప్రిన్సిపల్ గాయత్రిని వెంటనే సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ PDSU , KVPS నాయకులతో కలసి విద్యార్థులు నిరసన చేపట్టారు,
ఈ సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా PDSU ఉపాధ్యక్షులు దీపక్ రెడ్డి, KVPS మండల అధ్యక్షుడు గోపాల్ మాట్లాడుతూ విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ, వారి పట్ల కులవివక్షతో వ్యవహరిస్తూ,వారిని వేధింపులకు గురి చేస్తూ విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్న గోట్లపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గాయత్రిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.