ఆపరేషన్ స్మైల్ – 7ను విజయవంతం చేయడం కోసం అన్ని శాఖల సమన్వయంతో పని చేసి మంచి ఫలితాలు సాధించాలని నల్లగొండ అదనపు ఎస్పీ నర్మద అన్నారు.
మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో కార్మిక శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, పోలీస్, బాలల సంక్షేమ సమితి, ఇతర శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు.
బాలల చేత పనులు చేయిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం ద్వారా బాల కార్మికులకు విముక్తి కల్పించేలా ఆపరేషన్ స్మైల్ బృందాలు పని చేయాలని కోరారు.
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 2015 సంవత్సరం నుండి 2021 వరకు 15 విడతలుగా జనవరి, జులై నెలలో నిర్వహిస్తున్నదని ఆయన చెప్పారు. ఆపరేషన్ స్మైల్ విజయవంతం కోసం ఒక్కో సబ్ డివిజన్ పరిధిలో ఒక ఇన్స్ పెక్టర్, నలుగురు కానిస్టేబుల్స్ ను ప్రత్యేకంగా కేటాయించి చైల్డ్ లైన్ తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రభుతయేతర స్వచ్చంద సంస్థలను గుర్తించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించనున్నామని ఆమె వివరించారు.
కోవిడ్ కారణంగా పాఠశాలలు నడవడం లేదని ఆర్ధిక సమస్యల కారణంగా పిల్లలను పనిలో పెడుతున్న పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రోడ్లపై భిక్షాటన చేసే చిన్నారులు, దుకాణాలు, హోటల్స్, దాబాలలో పని చేస్తున్న బాల కార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
బాలల హక్కులు అందరూ కాపాడాలి
బాలల సంక్షేమ సమితి చైర్మన్ డి. రాము మాట్లాడుతూ బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మానందరిపైనా ఉన్నదని, బాల కార్మిక వ్యవస్థ నిర్ములన కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా బాలలను పనిలో పెట్టుకున్న వారికి 25,000 జరిమానా విధించవచ్చని, బాలలంతా చదువుకున్నప్పుడే దేశం అభివృద్ది చెందుతుందని చెప్పారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్ములన లక్ధ్యంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్ విజయవంతం కోసం అందరూ సమన్వయంతో పని చేయాలని కోరారు.
సమావేశంలో సిఐ రవీందర్, బాలల పరిరక్షణ అధికారి గణేష్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కమలాకర్, నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ సబ్ డివిజన్ల ఆపరేషన్ స్మైల్ బృందాల సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.