నూతన పార్లమెంట్ భవన ప్రారంభానికి రాష్ట్రపతిని పిలవకపోవడం అవమానకరమైన విషయమని, ఎందుకు రాష్ట్రపతిని పిలవలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్థానిక సుందరయ్య భవనంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గుడవర్తి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సిపిఎం పాలేరు నియోజకవర్గ సమావేశంలో తమ్మినేని వీరభద్రం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ప్రారంభంలో ప్రతిపక్షాలకు కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని, 19 పార్టీలు బాయ్ కాట్ చేసినా సరే అత్యంత దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పార్లమెంట్ భవనాన్ని
ప్రారంభించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వం, దానిని వెనక నుండి నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ ఈ దేశాన్ని మత రాజ్యాంగ మార్చేందుకు కుట్రలు చేస్తున్నాయని, అందుకే రాజ్యాంగాన్ని కూడా మార్చే ప్రయత్నం
చేస్తున్నారని, పాత రాచరిక వ్యవస్థను తీసుకువచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్ధతిలో వారి విధానాలు ఉన్నాయని ఆయన అన్నారు. అందుకే బిజెపి ఆర్ఎస్ఎస్ మతతత్వ విధానాలను వెనక్కి కొట్టేందుకు క్యాడర్ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కర్ణాటకలో లాగా దేశం నుంచి కూడా బిజెపిని తరిమేసే సమయం ఆసన్నమైందని, మతోన్మాద
రాజకీయాలు యిక మీదట సాగవని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన పోరాటాలను ఉధృతం చేయాలని
ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జూన్, జూలై నెలల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.