అడవులను పరిరక్షించడం ద్వారా భావితరాలకు కాలుష్యరహిత సమాజాన్ని అందించాల్సిన బాధ్యత మానందరిపై ఉన్నదని డిఐజి ఏ.వి. రంగనాధ్ అన్నారు.
శుక్రవారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిఎంసి టెలివిజన్ ఆధ్వర్యంలో చండూర్ సిఐ సురేష్ కుమార్ అద్భుతగానంతో రూపొందించిన అడవుల ప్రాధాన్యత, అడవుల వల్ల మానవాళికి ప్రయోజనాలు, అడవుల పరిరక్షణ ప్రాధాన్యత వివరిస్తూ అద్భుతంగా చిత్రీకరించిన పచ్చనడవి వీడియో పాటను ఆయన విడుదల చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యం చేయడం, సామాజిక బాధ్యతతో జిఎంసి టీమ్ వివిధ రకాల అంశాలను వేదికగా చేసుకొని సమాజాన్ని చైతన్యం చేసే విధంగా చక్కటి పాటలను రూపొందించి సమాజం పట్ల తమ బాధ్యతను ప్రదర్శించడం ఎంతో గర్వకారణమని చెప్పారు.
పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం ప్రాధాన్యతలను అందరికి తెలియజేసే విధంగా అర్ధవంతమైన చరణాలతో పాటను రాసిన సినీ మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్, వారి GMC బృందం గణేష్ రెడ్డి, నిస్సార్, బి. అనిల్ కుమార్ లను, డిఐజి అభినందించారు.
సమాజం పట్ల బాధ్యతతో జిఎంసి విడుదల చేసే పాటలను తాను క్రమం తప్పకుండా చూస్తున్నానని భవిష్యత్తులో సమాజాన్ని మేల్కొలిపే విధంగా పాటలను రూపొందించి ప్రజా మన్ననలు అందుకోవాలని సూచించారు.
పాటను రూపొందించిన జిల్లాకు చెందిన సినీ కళాకారుడు చరణ్ అర్జున్ బాధ్యతాయుతంగా ఇలాంటి పాటలు, లఘు చిత్రాలను రూపొందించడం జిల్లాకే గర్వకారణమన్నారు. చండూర్ సిఐ సురేష్ చక్కని గానం ఎంతగానో అలరించిందని రంగనాధ్ అభినందించారు.
కార్యక్రమంలో అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, సిఐలు మహబూబ్ బాషా, పి.ఎన్.డి. ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, రూరల్ ఎస్.ఐ. రాజశేఖర్ రెడ్డి, జిఎంసి బృందం గణేష్ రెడ్డి, నిస్సార్, బి. అనిల్ కుమార్, పోలీస్ సిబ్బంది కార్తీక్, ఆఫ్రోజ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.