రామతీర్ధం లో నీలాచలం కొండపై రాముని విగ్రహ ధ్వంసం కేసును ఏపీ పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. సంఘటన జరిగిన అయిదు రోజులు దాటినా ఎలాంటి పురోగతి కనిపించ లేదు. కేసును సిబిసిఐడికి రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. కొండ వద్దకు రాజకీయ నేతల తాకిడి అధికమైంది.
స్వయంగా అధికార పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి రావడంతో టీడీపీ, బీజేపీలు మరింత దూకుడు పెంచాయి. పరిస్థితి సీరియస్ గా ఉందని ప్రభుత్వం భావించి వెంటన…విశాఖ రేంజ్ డీఐజీ రంగారావును స్వయంగా ఘటనా స్థలికి వెళ్లి నిజానిజాలు తెలుసుకోవాలని రాష్ట్ర డీజీపీ పంపించారు.
దీంతో హుటాహుటిన రేంజ్ డీఐజీ రంగారావు విజయనగరం జిల్లా ఎస్సీ సమక్షంలోనే పోలీసు అధికారులతో సమావేశమై…అక్కడ నుంచీ రామతీర్ధం టెంపుల్ కు వెళ్లారు. అక్కడ దేవాలయ పురోహితులతో రేంజ్ డీఐజీ రంగారావు ప్రత్యేకించి సమావేశమయ్యారు.
జరిగిన ఘటనపై పూర్తి స్థాయిగా దేవాలయ పురోహితులు, అధికారులతో సీరియస్ గానే డీఐజీ చర్చించారు.కేసు మిస్టరీని చేధించేందుకు తమ శాఖ ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని, నిందితులను పట్టుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలన్నారు.
కేసు చేధించేందుకు ఉన్న ఏ అవకాశాన్ని విడిచి పెట్టవద్దని సిబ్బందిని ఆదేశించారు. సాంకేతిక, భౌతిక ఆధారాలను మరింత లోతుగా పరిశీలించేందుకు దర్యాప్తును ముమ్మరం చేయాలని పోలీసు అధికారులకు, సిబ్బందికి దిశా నిర్దేశం చేసారు.
అంతకుముందు జిల్లా ఎస్పీ నేరం జరిగిన తీరును గురించి విశాఖ డీఐజీకి వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారితో పాటు పార్వతీపురం ఓఎస్డీ ఎన్. సూర్య చంద్ర రావు, విజయనగరం డిఎస్పీ పి. అనిల్ కుమార్, సీసీఎస్ డీఎస్పీ జె. పాపారావు, సీఐలు ఎన్.శ్రీనివాసరావు, జి. రాంబాబు, రుద్రశేఖర్, వెంకటరావు, ప్రత్యేక బృందాల ఎస్ఏలు, సిబ్బంది పాల్గొన్నారు.