తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. మధ్యాహ్నం 1.23 గంటలకు బృహస్పతి మకరరాశిలోకి ప్రవేశించాక అలంపూర్ ఘాట్ వద్ద తొగుట పీఠాధిపతి మాధవనంద స్వామి, హిందూ దేవాలయ ప్రతిష్టాన్ పీఠాధిపతి కమలానంద భారతి స్వామిజీ శాస్త్రోక్తంగా ఈ పుష్కరాలను ప్రారంభించారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు చేసి, నదిలో పవిత్ర పుష్కర స్నానం చేశారు.
కోవిడ్ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నా, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆర్భాటాలు లేకుండా సంప్రదాయరీతిలో, శాస్త్రోక్తంగా నిర్వహించి పుష్కరాలను విజయవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు చేసింది.
నది పరివాహక ప్రాంతంలో 4 పుష్కర ఘాట్లను ప్రభుత్వం నిర్మించింది. ఘాట్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను కల్పించింది. ఘాట్ల వద్ద ప్రత్యేకంగా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేఅబ్రహం, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్ శృతి ఓఝా, ఎస్పీ రంజన్ రతన్ కుమార్, ఆలయ ఈవో, తదితరులు పాల్గొన్నారు.