ప్రజా సమస్యల పరిష్కారం, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11న కొత్తగూడెంలో ప్రజా గర్జన సభను నిర్వహిస్తున్నట్లు సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు.
పాలకులు ప్రజా సమస్యలను విస్మరించి పాలన సాగిస్తున్నారని ఆయన తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న పార్టీ నాయకులు, ప్రజా సంఘాల బాధ్యుల సంయుక్త సమావేశం స్థానిక గిరిప్రసాద్ భవన్లో
జరిగింది. ఎస్ కె జానిమియా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హేమంతరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం ఆ తర్వాత అవి అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం పాలకులకు అలవాటుగా
మారిందన్నారు. ప్రధాని మోడీ ప్రతి ఖాతాలో రూ. 15 -లక్షలు, యేటా రెండు కోట్ల ఉద్యోగాలంటూ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించారని ప్రధాని కాగానే ఇవన్ని మరచిపోయి పకోడీలు అమ్మడం కూడా ఉద్యోగమే అంటున్నారని
హేమంతరావు తెలిపారు. ప్రభుత్వరంగ ఆస్తులను తెగనమ్మడమే ప్రధాని బాధ్యత అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాక పాలనకు చరమగీతం పాడేందుకు మోడీ యత్నిస్తున్నారని ఈ
క్రమంలోనే ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారన్నారు. కేసీఆర్ కూడా 2018 ఎన్నికలకు ముందు ఇచ్చిన రుణమాఫీ, నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని హేమంతరావు డిమాండ్ చేశారు. ఐదో సంవత్సరం కూడా పెట్టుబడులు
పెట్టే సమయం ఆసన్నమైందని ప్రభుత్వం రుణమాఫీ చేస్తే బ్యాంకులు తిరిగి అప్పులు ఇస్తాయని తద్వారా ప్రైవేటు వడ్డీ వ్యాపారులను రైతులు ఆశ్రయించే పని తప్పుతుందన్నారు. ఉపాధి కల్పించలేనప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తామని
ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని హేమంతరావు సూచించారు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాలకులు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే నినాదంతో ఈ నెల 11న మధ్యాహ్నం మూడు గంటలకు ప్రకాశం మైదానంలో ప్రజాగర్జన బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.