రాజస్థాన్ లో ఘోరం జరిగింది.వివాహ వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 9మందిఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు మరణించగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ విషాద ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని భిల్వారా నగరానికి సమీపంలోని బిగోడ్ ప్రాంతంలో జరిగింది. భిల్వారా ప్రాంతానికి చెందిన జగదీష్ త్రివేది తన కుమారుడి వివాహం అనంతరం ఇంటికి కుటుంబ సభ్యులతో తిరిగి వస్తుండగా బస్సు, కారును ఢీకొంది.
ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మరణించారు. ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఓ బాలిక ప్రమాదంలో మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో 15 మందిని మహాత్మాగాంధీ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని మహాత్మాగాంధీ ఆసుపత్రి డాక్టర్ అరుణ్ గౌడ్ చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.