ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై రాష్ట్ర ప్రజలలో కనిపిస్తున్న ఆగ్రహం, అసహ్యమే అమెరికాలో నివసిస్తున్న ప్రవాసాంద్రులలో కూడా కనిపిస్తోంది. మూడు వారాల పాటు తన అమెరికా పర్యటనలో భాగంగా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అక్కడ స్థిరపడిన తెలుగువారు హాజరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, అఘాయిత్యాలను పరిశీలిస్తున్న వారు ఎంతో బాధ్యతతో ఉన్నారు. అంతే కోపంతో బాధపడుతున్నారని స్పష్టంగా అర్థం అయ్యింది. ఈ దరిద్రం ఎప్పుడు వదిలి పోతుందని ప్రశ్నిస్తున్నారు అని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణంరాజు అన్నారు.
శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. అమెరికాలో స్థిరపడిన తెలుగు వారితో నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి 30 నుంచి 40 మంది రావొచ్చు అనుకుంటే, 300 మందికి తగ్గకుండా హాజరయ్యారు. 14 నుంచి 15 సమావేశాలను నిర్వహిస్తే ఒక్కొక్కసారి 500 మంది కూడా ఈ సమావేశాలలో పాల్గొన్నారు. పురుషులతోపాటు మహిళలు కూడా వీక్ డేస్ లో జరిగిన సమావేశాలకు పెద్ద ఎత్తున హాజరు కావడం ఆశ్చర్యాన్ని కలగజేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్, జగ్గు భాయ్ అని సంబోధిస్తుంటే… పూర్తి పేరుతో పిలవాలని ఆయన కోరుకుంటున్నారు.
అందుకే మనం ఆయన్ని జమోరె అని సంబోధిద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జమోరె అంటే ఎంత కోపం అసహ్యం కలుగుతుందో … అమెరికాలో స్థిరపడిన సంపన్నులైన తెలుగువారిలోనూ అదే ఆగ్రహం, అసహ్యం కనిపిస్తోంది. అమెరికాలోని తెలుగువారి అంత కోపంగా ఉంటే, ఆంధ్ర ప్రదేశ్ లో నివసించే వారు ఇంకా ఎంత కోపంగా ఉంటారో ఊహించుకోవచ్చు. అమెరికాలో తెలుగు భాష పరిరక్షణ కోసం అక్కడ స్థిరపడిన వారు కృషి చేస్తున్నారు.
మనబడి, పాఠశాల పేరిట తెలుగు భాషను నేర్పించేందుకు చర్యలు తీసుకుంటూ, పరీక్షలను నిర్వహించి సర్టిఫికెట్లను అందజేస్తున్నారు. రాష్ట్రంలో మాత్రం శ కు ష తేడా తెలియని వ్యక్తుల పరిపాలనలో తెలుగు భాష తన వైభవాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది. అమెరికాలో స్థిరపడిన తెలుగువారు మాత్రం భాషా సంరక్షణ కోసం కృషి చేయడమే కాకుండా, కూచిపూడి భరతనాట్యం వంటి కళలను కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎన్నోసార్లు అమెరికాకు వెళ్లాను. కానీ ఈసారి అమెరికా పర్యటన జీవితంలో గుర్తుండిపోతుంది.
ముఖ్యమంత్రి జమోరె నన్ను నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా, ప్రధాని పర్యటనలో పాల్గొనకుండా ఎందుకు కట్టడి చేశారో ఇప్పుడు అర్థం అయ్యింది. అమెరికా పర్యటనలోనే ఇంతటి ప్రజాదరణ నాకు ఉంటే, నియోజకవర్గంలో ఎంతటి ప్రజాదరణ ఉంటుందో ఇంటలిజెన్స్ నివేదికల ద్వారా తెలుసుకున్న జెమోరె , నియోజకవర్గంలో నన్ను అడుగుపెట్టనివ్వడం లేదని స్పష్టమయిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.