రామారావు మహరాజ్ మనిషి రూపంలో ఉన్న దేవుడని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో గోర్ సమాజ్ ఎల్లారెడ్డి నియోజకవర్గం వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్ సహకారంతో బాల బ్రహ్మచారి సద్గురు రామారావు మహరాజ్ సంస్మరణ సభ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా బోర్ బండార్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి మహరాజ్ కు నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ.. రామారావు మహరాజ్ భౌతికంగా లేకపోయినా ఆయన ఆశీస్సులు అందరిపైన ఉంటాయన్నారు.
ఆయన మృతికి ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ లు ప్రగాఢ సానుభూతి తెలిపారని గుర్తు చేశారు. మనుషుల్లో దేవుడు మహరాజ్ అని కొనియాడారు. దేశానికి ఆధ్యాత్మిక భావాన్ని తెలిపిన మహరాజ్ కు భారత రత్న ఇస్తే భగవంతునికి ఇచ్చినట్టేనని తెలిపారు.
గిరిజనులంటే గిరిపుత్రులని, అలాంటి గిరిజనులంటే సీఎం కేసీఆర్ కు అమితమైన ప్రేమ అని తెలిపారు. రామారావు మహరాజ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై పెట్టడానికి సీఎం కేసీఆర్ తో మాట్లాడతానని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. తాను 12 సార్లు మహరాజ్ వద్ద ఆశీర్వాదం తీసుకున్నానని గుర్తు చేసుకున్నారు.
మహరాజ్ మన మధ్య లేకపోవడం బాధాకరమని తెలిపారు. ఆయన చూపిన బాటలో గిరిజనులంతా ఏకతాటిపై నడవాలని పిలుపునిచ్చారు