ప్రజా రాజధాని అమరావతిపై కాలు పెట్టి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు చేతులూ కాల్చుకున్నారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. రైతుల భాగస్వామ్యంతో ఏర్పడిన రాజధానిని పెకలించేందుకు ముఖ్యమంత్రి శాసనసభలో మూడు రాజధానుల ప్రకటన చేసి సరిగ్గా నేటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేశారు. రాజధాని మార్పు తలంపుతోనే రాష్ట్రానికి అరిష్టం దాపురిచిందని తెలిపారు. మూడు రాజధానులతో రాజకీయ లబ్ధి చేకూరుతోందనుకున్న ముఖ్యమంత్రి అశలు కూడా అడియాశలయ్యాయన్నారు. ఈ సత్యం సీఎంకూ తెలిసిందని చెప్పారు.
ఆయన ముందుకు పోలేక, వెనక్కి రాలేక బాధ పడుతున్నారని తెలిపారు.రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రజలు ఒక్క రాజధాని ఉంటే చాలు అన్న భావనను బలంగా కలిగి ఉన్నారన్నారు. రాజధాని కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాజధాని కోసం ఉద్యమిస్తుంటే, వైకాపా ప్రభుత్వం మాచర్లలో చేసిన ఘనకార్యం గూర్చి ఆరా తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
మూడేళ్ళు గా రాజధాని ఎక్కడ ఉందో తెలియని రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయి? శాంతిభద్రతలు కొరవడిన రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎవరిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడీ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నట్టు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు లో వేసిన పిటీషన్ ఉపసంహరించుకొని,మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే పారిశ్రామిక వేత్తలు కూడా రాష్ట్రం విడిచి వలస పోతారని బాలకోటయ్య హెచ్చరించారు.