విద్యార్థుల్లో తగ్గిన పఠనాసక్తిని పెంపొందించేందుకు విద్యాశాఖ దృష్టి సారించింది. విద్యార్థుల్లో పఠన శక్తి పెంపొందించడంతో పాటు బాగా చదివే విధంగా ఆసక్తి పెంపొందించేందుకు రీడ్ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. వంద రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమం అమలుపైన నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ ఉపాధ్యాయులకు స్పష్టమైన ఆదేశాలు డిఈవో గోవిందరాజులు జారిచేశారు.
కొవిడ్ పరిస్థితులు, ఆన్లైన్ బోధన విద్యార్థుల చదువులపైన తీవ్ర ప్రభావం చూపింది. ఈ తరహా బోధనతో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య కొంత అంతరం ఏర్పరింది. ఫలితంగా విద్యార్థుల్లో పఠనాసక్తి చాలా వరకు తగ్గిపోయింది. గత నవంబరు నెలలో జాతీయసామర్థ్యాల మదింపు అంచనా సర్వే నిర్వహించారు.
ఈసర్వే ఫలితాలు ఇంకా వెలువడపోయినా విద్యార్థుల సామర్థ్యాలు కిందకు పడిపోయినట్లుగా గుర్తించిన ప్రభుత్వం మొదట విద్యార్థులపై దృష్టి కేంద్రీకరించింది. విద్యార్థుల్లో తగ్గిపోయిన పఠనాసక్తిని పెంపొందించేందుకు రీడ్ (రీడ్ఎంజాయ్ అండ్ డెవలప్- చదువు, ఆనందించు, అభివృద్ధి చెందు) అనే కార్యక్రమానికి రూపకల్పన చేసింది. దీనికోసం విద్యాశాఖ వందరోజుల ప్రత్యేక కార్యాచరణ రూపొందింది.
ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపొందించారు. ఈనెల 5వ తేదీ నుంచి వంద రోజుల పాటు విద్యార్థుల్లో వివిధ సామర్థ్యాలు పెంపొందించే లక్ష్యంగా ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. కథలు, గ్రంథాలయ పుస్తకాలతో పాటు పాఠ్య పుస్తకాలను విద్యార్థులతో చదివిస్తారు.
వారంలో సోమ, మంగళవారాలు తెలుగు, బుధ, గురువారాలు ఆంగ్లం, శుక్ర, శనివారాలు ఉర్దూ లేదా మరో పుస్తక పఠనం చేయించనున్నారు. అవకాశం ఆధారంగా రోజుకో పీరియడ్ పఠనం అనది తప్పనిసరి క్రియగా అమలుచేయనున్నారు. పఠనం అలవాటు అయితే విద్యార్థులు ఏదైనా నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారని అధికారులు భావిస్తున్నారు.
ఆలస్యమైనా విద్యార్థుల పఠనాశక్తి పెంపొందేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించడాన్ని తల్లిదండ్రులు స్వాగతించనున్నారు. శనివారం శ్రీకారం చుట్టనున్న కార్యక్రమం గురించి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక, ప్రాథమికొన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించారు.
వంద రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గాంధీ ఉన్నత పాఠశాల స్కూల్ కాంప్లెక్స్ లో పకడ్బందీగా అమలు చేసేందుకు ఉపాధ్యాయులను సంసిద్ధులను చేసే విధంగా విద్యా శాఖ చర్యలు చేపట్టిందని స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శోభారాణి తెలిపారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్