కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గిన ప్రపంచ దేశాలలో భారతదేశం ముందు వరుసలో ఉండడం ప్రజలందరికీ గర్వకారణం. ఐతే ఇదే స్ఫూర్తిని కొంత కాలం కొనసాగించక తప్పదు. దేశ ప్రజల పూర్తి సహకారం ఈ దశ లో మరింత అవసరం.
వైద్య, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగించేందుకు సముఖత వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఏకపక్షంగా లాక్ డౌన్ ప్రకటించారని విమర్శించిన నాయకులు కూడా నేడు లాక్ డౌన్ మరి కొన్ని రోజులు ఉంటే బాగుంటుందని సన్నాయి నొక్కులు నొక్కడం ఇక్కడ గమనార్హం.
రాజకీయాలు ప్రస్తావించడం ఇక్కడ అవసరం లేదు కాబట్టి ఆ వివరాల్లోకి వెళ్లవద్దు. లాక్ డౌన్ సడలింపుల సాధ్యాసాధ్యాలపై పలు శాఖల నిపుణుల సలహాలను కేంద్ర ప్రభుత్వం స్వీకరించింది. ఈ మేరకు కొన్ని సెక్టార్లలో మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.
ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ఎలా ఉన్నా ప్రజలు కొన్ని నిబంధనలు విధిగా పాటించాల్సి ఉంటుంది. అవి: 1)లాక్డవున్ ఆంక్షలు సడలిస్తే నిబంధనల మేరకు ప్రజలు నడుచుకోవాలి.2) ఇంకొంత కాలం ఫేస్ మాస్కులు ధరిస్తూ ,భౌతిక దూరం ,వ్యక్తి గత పరిశుభ్రత విధిగా పాటించాలి.
3) జన సమూహం దగ్గరకు వెళ్ళ కపోవడమే అన్ని విధాలా శ్రేయస్కరం.4) ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు, వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వారిలో మానసిక బలాన్ని నింపాలి. 5)సమతుల్య ఆహారం ఇంటిల్లిపాదీ తీసుకోవాలి.
6) వైద్యుల సలహా లేనిదే మెడిసిన్ వాడకూడదు. ఆరోగ్య సమస్య రెండు, మూడు రోజుల్లో తగ్గని పరిస్థితులలో లేనిపోని అనుమానాలకు, అపోహలకు తావివ్వకుండా అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాన్ని పొందాలి. 7) కరోనా బారి నుంచి పూర్తిగా కోలుకొన్న వారిపై వివక్షత ను విడనాడాలి.
సాటి మనిషి ఓదార్పు అవసరమైన సందర్భంలో మానవతను చూపాలి.8) కేంద్ర ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం అందుబాటులోకి తెచ్చిన ఆరోగ్య సేతుని సద్వినియోగం చేసుకోవాలి.9) వైరస్ బాధిత అనుమానితులు ఉంటే అందుబాటులో ఉన్న అధికారులకు తెలపడం సామాజిక బాధ్యతగా స్వీకరించాలి.
సకల ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం శ్రమిస్తూన్న వైరస్ యోధులకు నైతిక మద్దతు గా లాక్డవున్ నియమావళిని సక్రమంగా పాటించాలి. ప్రభుత్వం, ప్రజలు సమన్వయంతో , పరస్పర సహకారం తో సాగిస్తున్న నిర్విరామ యజ్ఞం సఫలం కావాలని ఆశిద్దాం.