గంటపాటు శ్రమించి కాపాడిన రెస్క్యూ సిబ్బంది: పర్యవేక్షించిన ఎమ్మెల్యే, కలెక్టర్
వ్యవసాయ పనులు కోసం వెళ్లిన రైతన్న అనుకోకుండా పెరిగిన వాగు ఉధృతిలో చిక్కుకుపోయారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మాతు సంగెం, పేట్ సంగెం గ్రామాల మధ్య చోటుచేసుకుంది. గాంధారి మండలం మాతూ సంగెం- పేట్ సంగెం గ్రామాల మధ్య పెద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. వ్యవసాయ పనుల కోసం వెళ్లి మాతు సంగెం గ్రామానికి చెందిన గౌరీ సంగయ్య అనే వ్యక్తి చిక్కుకుపోయాడు. వాగులో చిక్కుకున్న సంగయ్య కాపాడాలంటూ అర్ధనాదాలు చేశాడు.
ఈ రోజు ఉదయం వ్యవసాయ పొలం వద్దకు వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో వాగు ఉదృతి పెరగడంతో అక్కడి చిక్కుకు పోయాడు. సంగయ్యను కాపాడేందుకు స్థానికులు, గ్రామస్తులు వెళ్ళారు. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే జాజల సురేందర్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ లు సంఘటనా స్థలానికి చేరుకుని సంగయ్యను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా అధికారులకు సమాచారం అందించారు. సుమారు గంట సేపు శ్రమించి బోటు సహాయంతో సంగయ్యను బయటకు తీసుకువచ్చారు.
ఆలీ సాగర్ నుండి తెప్పించిన బోటులో స్థానిక ఎమ్మెల్యే సురేందర్ సైతం వెళ్లి బాదితున్ని సురక్షితంగా తీసుకువచ్చారు. దాంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సురేందర్, కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ.. వర్షాల కారణంగా వాగులు పొంగి పొర్లుతున్న వైపు ప్రజలు వెళ్లవద్దని, ముఖ్యంగా రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లేముందు జాగ్రత్తలు పాటించాలన్నారు.