గ్రామాల్లోకి విద్యుత్ బకాయిలు వసూలుకు వెళ్తున్న అధికారులకు చుక్కెదురవుతోంది. అడుగడుగునా అధికారులను గ్రామస్తులు నిలదీస్తున్నారు. పంచాయతీ కార్యాలయాల్లో బందిస్తున్నారు. తాజాగా కామారెడ్డి, తాడ్వాయి మండలాల్లో విద్యుత్ అధికారులను ప్రజలు ఎక్కడిక్కకడ నిలదీశారు. ఎంత పడితే అంత బిల్లులు వేస్తే కట్టాలా అని ప్రశ్నించారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు.
కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో గ్రామ చావిడి వద్ద అధికారులను కదలనివ్వలేదు. ఏసీడీ పేరుతో వందలు, వేలు తమపై రుద్దితే ఎలా అని ప్రశ్నించారు. అధికారులు సర్దిచెప్పడానికి ప్రయత్నించినా ప్రజలు వినిపించుకోలేదు. తాడ్వాయి మండలం బ్రహ్మణపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో విద్యుత్ అధికారులను నిర్బంధించారు. ఏసీడీ పేరుతో వేసిన బిల్లులకు తమకు సంబంధం లేదని తెలిపారు. ఇష్టానుసారం బిల్లు వేస్తే చెల్లించే ప్రసక్తే లేదని చెప్పారు. దాంతో విద్యుత్ బకాయిలు వసూలు చేయడానికి గ్రామాల్లోకి వెళ్లాలంటే అధికారులు జంకుతున్నారు.