భక్తుల సౌకర్యార్థం 3 కోట్ల 10 లక్షల తో వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనులన్నీ పూర్తి
మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతంగా నిర్వహించడం కోసం భక్తుల సౌకర్యార్థం వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనులన్నీ పూర్తిచేసుకుని జాతర నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్ తెలిపారు. సోమవారం మేడారం ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్, జిల్లా కలెక్టర్ యస్. కృష్ణ ఆదిత్య, ఐ టి డి ఎ పిఓ అంకిత్, ఎ ఎస్ పి సుదీర్ రామ్నాద్ కేకన్ లతో కలసి మంత్రి మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య మినీ మేడారం జాతర నిర్వహణపై, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మేడారం భక్తుల సంఖ్య పెరుగుతుందని మినీ మేడారం జాతరకు నాలుగు నుండి ఐదు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నదని, జాతర సమీపిస్తున్న నేపధ్యంలో పరిసరాల పరిశుభ్రత, త్రాగునీరు, మరుగుదొడ్లు శుభ్రం చేయుట, స్నాన గదులు, బట్టలు మార్చు గదులు, జాతర పరిసర ప్రాంతాల్లో పరిసరాల పరిశుభ్రత శానిటైజ్ చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలనీ సంబంధిత అధికారులను ఆదేశించారు.
కొండాయి, ఐలాపూర్, బయ్యక్క పేటలో వంటి ప్రాంతాల్లో జరిగే మినీ జాతర అన్ని ఏర్పాట్లను సమకూర్చాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జాతర పరిధిలో ఉన్న కోళ్లు, మేకలు దుకాణదారులతో ఒక సమావేశం నిర్వహించుకొని కోళ్లు, మేకల వ్యర్థాల గురించి చర్చించుకుని వాటన్నిటినీ కలెక్ట్ చేసి డంపింగ్ యార్డ్ కు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని పంచాయితీ అధికారులను ఆదేశించారు. జాతరలో భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించి ప్రశాంతంగా సమ్మక్క సారలమ్మ వారిని దర్శించుకునే లా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
జెడ్పి చైర్మన్ కుసుమ జగదీష్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కు గత రెండు మహా జాతరలను విజయవంతం చేసిన అనుభవం ఉన్నదని, మినీ జాతర విజయవంతానికి అధికారుల సమన్వయంతో పరివేక్షణ చేస్తూ జాతర విజయవంతం చేయాలని అయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, డి అర్ ఓ రమాదేవి, సర్పంచ్ బాబురావు, ఎం పి పి గొంది వాణి శ్రీ , ఆలయ ఈ. ఓ రాజేందర్, మేడారం పూజారులు సిద్దబోయిన జగ్గారావు, ట్రైబల్ వెల్ఫేర్ డి డి పోచం, డి టి డి ఓ జి దేశిరాం, ఆర్ అండ్ బి ఇ ఇ ఎన్.వెంకన్న, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ ఏ హేమలత, ఇరిగేషన్ డి. ఇ . E సదయ్య, ఇరిగేషన్ ఏ ఇ ఇ. కె అరవింద్, డి ఎల్ పి ఓ దేవరాజ్, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అధికారి E P ప్రేమలత, సంబంధిత శాఖ అధికారులు, తదితరులు పాల్గోన్నారు.
సత్యం న్యూస్ ,ప్రతినిధి ములుగు