ఏపి రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి సోదరుడు, కడప ఎంపి అవినాష్ రెడ్డి కి సీబీఐ షాకిచ్చింది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా సీబీఐ తన నోటీసులో పేర్కొన్నది. వై ఎస్ వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే.
ఏపి రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఈ దారుణ హత్య కేసును సీబీఐ విచారణకు బదిలీ చేశారు. సీబీఐ చాలా కాలంగా ఈ హత్య కేసు పై దర్యాప్తు చేస్తున్నది. ఇప్పటికే కొందరిని అరెస్టు చేసింది. కీలక వ్యక్తులు బయటే తిరుగుతున్నారని వారిని కూడా అరెస్టు చేయాలని చాలా కాలంగా వై ఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ వై ఎస్ సునీత డిమాండ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన కీలక ఆధారాలను ఆమె సీబీఐకి అందించారు.
వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ సోదరి వై ఎస్ షర్మిల కూడా తన వాగ్మూలాన్ని ఇచ్చారు. ఇంత జరిగినా కూడా సీబీఐ దర్యాప్తు ముందుకు సాగకపోవడంతో డాక్టర్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు దర్యాప్తును ఏపి రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆమె కోరడంతో సుప్రీంకోర్టు కేసును తెలంగాణ కు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు వేగవంతం అయింది. నేడు సీబీఐ అధికారులు పులివెందులలో దర్యాప్తు జరిపారు. చివరకు కడప ఎంపి అవినాష్ రెడ్డి కి సీబీఐ నోటీసులు జారీ చేసింది.