కేంద్రంలో మోడీ ప్రభుత్వం బిలో పొవర్టీ లైన్ (బీపీఎల్) దిగువన ఉన అందరికీ పలు పథకాలను వర్తింపచేస్తోంది. అందులో భాగంగా”ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకం”.ఈ పథకం ద్వారా సంప్రదాయ కుల వృత్తులు, హస్తకళాకారులకు ఆర్థిక స్వావలంబన లభిస్తుంది. ఈ మేరకు ఆ పథకం అమలు ,తీరుతెన్నులపై విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో అర్హులందరికీ ఫలాలు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి.ఎస్ ఆదేశించారు.
వృత్తి నైపుణ్యం పెంచి నాణ్యమైన ఉపాధి పొందేందుకు ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకం దోహదం చేస్తుందని కావున జిల్లాలోని అర్హత కలిగిన వారందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని నాణ్యమైన ఉపాధి పొందాలని కలెక్టర్ సూచించారు. ఈ మేరకు తన ఛాంబర్లో జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో పథకం అమలు, కలిగే ప్రయోజనాలు, అర్హుల గుర్తింపు, శిక్షణ తదితర అంశాలపై సమీక్షించారు. స్థానిక సచివాలయాలు, కామన్ సర్వీస్ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేయాలని పరిశ్రమల శాఖ అధికారులకు సూచించారు. వీలైనంత మంది అర్హులను పథకంలో చేరేలా ప్రణాళికాయుత కృషి చేయాలని చెప్పారు.
సమీక్షలో భాగంగా విశ్వకర్మ పథకం తాలూక ప్రయోజనాలను, అర్హత ప్రమాణాలను జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ఆర్. పాపారావు కలెక్టర్ కు వివరించారు. 18 ఏళ్ళు నిండిన వడ్రంగి, పడవల తయారీ, కవచాలు తయారీ, కమ్మరి, కుమ్మరి, తాళాలు, ఇతర పనిముట్లు తయారు చేసేవారు, స్వర్ణకారులు, శిల్పకారులు, చర్మకారులు, చెప్పులు తయారు చేయువారు, తాపీమేస్త్రీలు, బుట్టలు, చాపలు, చీపుర్లు, బొమ్మలు, ఇతర ఆట వస్తువులు తయారు చేసేవారు, క్షరకులు, పూలదండలు తయారు చేసేవారు, రజకులు, దర్జీలు, చేపల వలల తయారు చేసేవారు అర్హులని పేర్కొన్నారు.
మొబైల్ ఫోనుకు లింకైన ఆధార్ కార్డు సాయంతో స్థానిక సచివాలయం లేదా కామన్ సర్వీసెస్ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. కుటుంబంలో ఒక్కరికే అవకాశం ఉంటుందని అన్ని అర్హతలు సరిపోయినట్లయితే విశ్వకర్మ సర్టిఫికేట్ అందజేస్తామని అలా పొందిన వారికి ఐదు రోజుల పాటు ఉచిత శిక్షణ ఉంటుందని, శిక్షణ సమయంలో 500 భృతితో పాటు 15,000 విలువ కలిగిన టూల్ కిట్ అందజేస్తామని వివరించారు.
ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న వారికి 1లక్ష బ్యాంకు లోను ఐదు శాతం వడ్డీపై పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే 15 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ పొందిన వారికి ఐదు శాతం వడ్డీపై 2 లక్షల రుణ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. మొదటి విడత రుణం 18 నెలల్లో, రెండో విడత రుణం 30 నెలల్లో తీర్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాయితీ పథకాలు పొందిన వారు అనర్హులని పరిశ్రమల శాఖ జీఎం స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం ఆర్. పాపారావు, మెప్మా పీడీ సుధాకర్, జడ్పీ సీఈవో రాజ్ కుమార్, డీపీవో శ్రీధర్ రాజా, స్కిల్ డెవలప్మెంట్ అధికారి గోవిందరావు, మున్సిపల్ కమిషనర్లు, డీఆర్డీఏ, మత్య్సశాఖ, బ్యాంకు అధికారులు, పరిశ్రమల శాఖ ఐపీవోలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.