దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో వివిధ సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ముందుండాలని సర్ సంఘచాలక్ డా. మోహన్ జీ భాగవత్ పిలుపునిచ్చారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దక్షిణమధ్య క్షేత్రకు సంబంధించిన రెండు రోజుల సమావేశాలు హైదరబాద్ అన్నోజీగూడాలోని శ్రీ విద్యావిహార పాఠశాలలో నేడు(31 అక్టోబర్) ముగిశాయి.
సమావేశాల్లో ముగింపు ఉపన్యాసం చేసిన ఆయన మాట్లాడుతూ విజయదశమి ఉత్సవంలో ప్రస్తావించినట్లుగా వివిధ రంగాల్లో స్వయంఉపాధి కల్పించడానికి కౌన్సిలింగ్, నైపుణ్యం పెంపొందించేందుకు శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు.
శాఖల విస్తరణతోపాటు స్వయంసేవకులు కుటుంబ సమ్మేళనాలపై దృష్టి పెట్టాలని కోరారు. వారానికి ఒకసారి నిర్వహించే ఈ సమావేశాల్లో సామాజిక, పర్యావరణ అంశాలపై చర్చ జరపాలని సూచించారు.
ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన ప్రాంత సంఘచాలక్ (రాష్ట్ర అధ్యక్షులు)లు, ప్రాంత కార్యవాహలు(రాష్ట్ర కార్యదర్శులు), ప్రాంత ప్రచారకుల(రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శులు)తో కూడిన కార్యనిర్వహణ కౌన్సిల్ కు చెందిన 37మంది పదాధికారులు పాల్గొన్నారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దక్షిణమధ్య క్షేత్రం క్షేత్ర కార్యవాహ తిప్పేస్వామి తెలిపారు.
లాక్ డౌన్ సందర్భంగా సంఘ్ నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాల గురించి ఈ రెండు రోజుల సమావేశాల్లో సమీక్ష జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ శాఖలు తిరిగి ఎలా ప్రారంభించాలన్న అంశాన్ని కూడా చర్చించారు.
ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పదాధికారులు పర్యటనలు తిరిగి ప్రారంభిస్తారని తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్ ఆయుష్ నడింపల్లి తెలిపారు.