రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల చూపిస్తున్న అశ్రద్ధను తట్టుకోలేక మరో డ్రైవర్ ఆత్మహత్యా యత్నం చేశాడు. కొల్లాపూర్ బస్ డిపో వద్ద ఈ సంఘటన జరిగింది. గత 37 రోజులుగా ఆర్టీసీ సమ్మె జరుగుతున్న విషయం తెలిసిందే. ఇన్ని రోజులుగా సమ్మె జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రతి రోజూ ఆర్టీసీ కార్మికులు వచ్చి డిపో ఎదుట ధర్నా చేసి తమ నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఇక తనకు ఉద్యోగం ఉండదని బాధపడిన ఏ ఎస్ రెడ్డి అనే డ్రైవర్ నేటి ఉదయం నుంచి ఎంతో ఆవేదనతోనే ఉన్నాడు. ధర్నా కార్యక్రమం పూర్తి అయిన తర్వాత సాయంత్రం ఆరు గంటల సమయంలో అందరూ వెళ్లిపోతుండగా ఏ ఎస్ రెడ్డి ఇక బతుకుపై ఆశలేదని నిర్వేదంగా చెబుతూ అకస్మాత్తుగా వెళ్లి బస్ డిపో పక్కనే ఉన్న సెల్ టవర్ ఎక్కేశాడు. తాడుతో సహా టవర్ ఎక్కి అక్కడ ఉరివేసుకోవడానికి అతను ప్రయత్నించాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో ఆర్టీ సీ కార్మికులు అందరూ ఒక్క సారిగా ఉద్రిక్తతకు లోనయ్యారు. ఏం చేయాలో అర్ధం కానిపరిస్థితి కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో కొల్లాపూర్ ఎస్ఐ కొంపల్లి మురళిగౌడ్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సెల్ టవర్ ఎక్కి అక్కడ ఉన్న ఆర్టీసీ కార్మికుడిని ఎంతో చాకచక్యంతో కాపాడారు. అతడిని సెల్ టవర్ నుంచి దించి ఆసుపత్రికి పంపించారు. ఎస్ ఐ మురళీగౌడ్ సమయస్పూర్తికి అక్కడి అగ్నిమాపక సిబ్బంది కూడా సహాయం చేశారు. దాంతో ఒక కార్మికుడి ప్రాణం నిలిచింది. డ్రైవర్ ఏ ఎస్ రెడ్డి జటప్రోలు గ్రామానికి చెందిన వాడు. భార్యా పిల్లలు ఉన్నారు. సమ్మె ఎంతకూ ముగియడం లేదు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొండిగా వ్యవహరిస్తున్నారు. కార్మికుల పొట్టలు కొడుతున్నారని రోజూ చెబుతున్న ఏ ఎస్ రెడ్డి చివరకు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటనను ఆర్టీసీ జేఏసీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏ ఎస్ రెడ్డి ఆరోగ్యం విషమంగా ఉన్నందున కొల్లాపూర్ ఆసుపత్రి నుంచి నాగర్ కర్నూల్ లేదా మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.