36 C
Hyderabad
May 13, 2025 12: 46 PM
Slider తెలంగాణ

నిరవధిక నిరాహార దీక్ష విరమించిన ఆర్టీసీ జేఏసీ నేతలు

rtc jac

సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీసీ జేఏసీ నేతలు చేపట్టిన నిరవధిక దీక్షను విరమించారు. ఉస్మానియా ఆస్పత్రిలో అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి చేత కొదండరాం, ఎల్. రమణ, చాడ వెంకట్ రెడ్డి, మందకృష్ణ మాదిగ దీక్ష విరమింపజేశారు. బిపి, షుగర్ వ్యాధులు ఉన్న ఈ నేతలు మరిన్ని రోజులు దీక్ష కొనసాగిస్తే కోమాలోకి వెళ్లే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు. ప్రతిపక్ష నేతలు కూడా వారికి నచ్చ చెప్పడంతో దీక్ష విరమించేందుకు అంగీకరించారు. వారికి మంద కృష్ణమాదిగ, కోదండరాం లు నిమ్మ రసం ఇచ్చారు. డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులందరూ సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. సమ్మెపై ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడంతో జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలు రెండు రోజుల క్రితం నిరవధిక దీక్షకు దిగారు. వీరి ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు వీరి ధీక్షను భగ్నం చేసి అరెస్ట్ చేశారు. అనంతరం చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే జేఏసీ నేతలు ఆస్పత్రిలోనూ తమ దీక్షను కొనసాగించారు. ఈ క్రమంలో విపక్ష పార్టీ నాయకులు కోదండరాం, ఎల్. రమణ, చాడ వెంకట్ రెడ్డి, మందకృష్ణ మాదిగ, నాగం జనార్థన్ రెడ్డి తదితర నాయకులు సోమవారం ఆర్టీసీ జేఏసీ నేతలను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. దీక్ష విరమణ సహా, రేపు నిర్వహించతలపెట్టిన సడక్ బంద్‌ను వాయిదా వేయాలని సమిష్టిగా నిర్ణయించారు. అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి చేత నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన అశ్వత్థామ రెడ్డి.. 19న నిర్వహించతలపెట్టిన సడక్‌బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికుల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని అన్నారు. అయితే యథావిదిగా డిపోల వద్ద రేపు నిరసన దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

Related posts

వైసీపీ నుంచి అదానీ సతీమణి ప్రీతీ అదానీకి రాజ్యసభ సీటు?

Satyam NEWS

వారి సేవలు ప్రశంసనీయం

Murali Krishna

పేదలకు గుదిబండగా మారిన వంట గ్యాస్ ధరలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!